Hussain Sagar: ఈ ఏడాది కాలుష్యం తగ్గింది

14 Oct, 2021 09:19 IST|Sakshi

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై పీసీబీ నివేదిక 

సాక్షి, సిటీబ్యూరో: గత ఏడాది గణేష్‌ నిమజ్జనంతో పోలిస్తే.. ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజా నివేదిక వెల్లడించింది. కాలుష్యంపై బుధవారం తుది నివేదిక విడుదల చేసింది. ఇందులో నిమజ్జనానికి ముందు, నిమజ్జనం జరిగిన రోజులు, అనంతరం సాగర జలాలను నాణ్యతను పరిశీలించి నివేదికను వెలువరించింది.

ట్యాంక్‌ బండ్, బుద్ధ విగ్రహం, నెక్లెస్‌ రోడ్, ఎన్టీఆర్‌ మార్గ్, లేపాక్షి ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించి నీటి నాణ్యతను ప్రయోగశాలలో పరిశీలించారు. నిమజ్జనం సమయంలో సాగర జలాల్లో కరిగిన ఆక్సిజన్‌ శాతం తగ్గుముఖం పట్టిందని, కరిగిన ఘనపదార్థాల  మోతాదు పెరిగిందని, బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్, కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరిగిందని, భార లోహాల మోతాదు సైతం పెరిగిందని వెల్లడించింది.

నిమజ్జనం అనంతరం భారీగా వర్షాలు కురవడంతో.. సాగరంలో భారీగా వరద నీరు చేరి ఆయా కాలుష్యాల మోతాదు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం సాగర్‌ జలాల నాణ్యత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిమితుల మేరకే ఉన్నట్లు తెలిపింది.     

మరిన్ని వార్తలు