మండి బిర్యానీ తిని 12 మందికి అస్వస్థత.. కారణం అదేనా?

22 Mar, 2023 10:01 IST|Sakshi

మెదక్‌: ఓ హోటల్‌లో బిర్యాని తినడంతో పలువురు అస్వస్థతకు గురై చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సీతారాంపూర్‌ గ్రామానికి చెందిన పవన్, అరవింద్, మహేందర్‌ ఈనెల 18వ తేదీ రాత్రి నర్సాపూర్‌లోని ఓ మండి హోటల్‌లో మండి బిర్యాని పార్శిల్‌ తీసుకెళ్లి తిన్నారు. అలగే నర్సాపూర్‌కు చెందిన అజీజ్‌ మరో ఆరుగురు మిత్రులతో కలిసి అదే మండి హోటల్‌ తిని అస్వస్థతకు గురయ్యారు.

ఇదిలాఉండగా నర్సాపూర్‌కు చెందిన మహేశ్, షకీల్, నాని కూడా అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు కావడంతో మహేశ్‌ ఆదివారం రాత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మిగిలిన వారు ఇంటి వద్దనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మీర్జానజీంబేగ్‌ను అడగ్గా ఫుడ్‌ పాయిజన్‌తో వారికి వాంతులు విరేచనాలు అయ్యాయని చెప్పారు.

శాంపిల్స్‌ సేకరణ
నర్సాపూర్‌లోని మన్నత్‌ అరేబియన్‌ మండి హోటల్‌ నుంచి పలు శాఖల అధికారులు  శాంపిల్స్‌ సేకరించినట్లు జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీత తెలిపారు. మన్నత్‌ మండి హోటల్‌ బిర్యాని తిన్న పలువురు యువకులు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలెక్టర్‌ రాజర్షిషా ఆదేశాల మేరకు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీత, వైద ఆరోగ్య శాఖ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ విజయనిర్మల, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట్‌గోపాల్‌ తదితరులు మంగళవారం హోటల్‌లో తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ హోటల్‌లో వాడుతున్న పదార్థాలను పరిశీలించడంతో పాటు కొన్ని శాంపిల్స్‌ సేకరించారు. తాము సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతామని, ఆ నివేదికలు వచి్చన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. హోటల్‌లో అధికారులు కలియ తిరిగారు. 

మరిన్ని వార్తలు