ఇంట్లోనే ‘హ్యాపీ న్యూ ఇయర్‌’!

31 Dec, 2020 08:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 కరోనా నేపథ్యంలో బయటకు వెళ్లలేమంటున్న జనం..

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సంవత్సరం వస్తుందనగానే ప్రత్యేకంగా ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలా అంటూ యువతతో పాటు ఇతర ‘విందు ప్రియులు’ముందస్తు ప్రణాళికల్లో మునిగిపోయేవారు. సెలబ్రిటీ షోలు, మ్యూజిక్‌ బ్యాండ్లు, ఇంటర్నేషనల్‌ డీజేలు, విదేశీ కళాకారుల ప్రోగ్రామ్‌లు, లైవ్‌ ఫెర్‌ఫార్మెన్స్‌.. ఇలా విభిన్న రకాల కార్యక్రమాల మధ్య గ్రాండ్‌గా న్యూ ఇయర్‌కు స్వాగతం పలికేవారు. ఇప్పుడు ఇదంతా కోవిడ్‌ మహమ్మారి కారణంగా గతంలాగా, ఓ జ్ఞాపకంగానే మిగిలిపోనుంది. న్యూ ఇయర్‌ ఈవ్‌ పార్టీలు, ఇతర సెలబ్రేషన్లపై ఈసారి కరోనా మబ్బులు కమ్ముకున్నాయని ఆయా రంగాల నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి.. కొత్తగా యూకే కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌ సృష్టిస్తున్న ప్రకంపనలతో మనోళ్లు, భద్రతలు, జాగ్రత్తలకే ఓటేస్తున్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనడం, గుంపులుగా గ్రాండ్‌ పార్టీలు చేసుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో గడపడం విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి వెళ్లి ఆపదను కొనితెచ్చుకోవడం కంటే ఇళ్ల్లలోనే ఉంటూ న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకునేందుకు పలువురు మొగ్గుచూపుతున్నారు. 

ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తామంటున్న 65 శాతం.. 
న్యూ ఇయర్‌ను ఆన్‌లైన్‌లో తమ ఫేవరేట్‌ రెస్టారెంట్‌ నుంచి ఆర్డర్‌ చేసిన స్పెషల్‌ ఫుడ్‌ను, తెచ్చుకున్న ‘మందు’ను ఆస్వాదిస్తూ స్వాగతిస్తామని 65 శాతం మంది చెబుతున్నారు. మొత్తంగా కోవిడ్‌ కాలంలో బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే, కుటుంబసభ్యుల మధ్యే జరుపుకుంటామని 50 శాతం మంది చెబుతున్నారు. నూతన సంవత్సర వేడుకలను ఏవిధంగా జరుపుకునేందుకు సిద్ధపడుతున్నారనే దానిపై హాస్పిటాలిటీ కన్సల్టెంట్‌ ‘అవిఘ్న సొల్యూషన్స్‌’ దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 1 నుంచి 21 తేదీల మధ్యలో ఆన్‌లైన్‌ రెస్పాన్స్, ఓపెన్‌ సోర్స్‌ డేటా ద్వారా నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వైరస్‌ వ్యాప్తి భయంతో బహిరంగ ప్రదేశాల్లో పారీ్టలు, వేడుకల్లో పాల్గొనేందుకు, అపరిచితులు, కొత్త వారితో పాటు ఉత్సవాల్లో పాల్గొనేందుకు, పలువురు గుంపుగా గుమిగూడే చోట్లకు వెళ్లేందుకు పలువురు అనాసక్తిని వ్యక్తంచేస్తున్నట్టు తేలింది.

ముఖ్యాంశాలివే..

  • రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలని అనుకుంటున్న వారు 10 శాతం మంది మాత్రమే.. నగర రణగొణ ధ్వనులకు దూరంగా ఏవైనా బీచ్‌లు, హిల్స్, తదితర ప్రాంతాల్లో హాలిడే ప్లాన్‌ చేసిన వారు 15 శాతం 
  • సర్వేలో పాల్గొన్న మూడింట రెండు వంతుల మంది ‘ఆల్కహాలిక్‌ బేవరేజెస్‌’ను రుచి చూడడం ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని భావిస్తున్నారు. 
  • ఆన్‌లైన్‌లో నార్త్‌ ఇండియన్‌ డిష్‌లను తెప్పించుకునేందుకు 56 శాతం మంది మొగ్గుచూపుతున్నారు.  
  • బిర్యానీ సెకండ్‌ బెస్ట్‌ చాయిస్‌గా నిలుస్తోంది..  
మరిన్ని వార్తలు