Photo Story: ఈ సాహసం ప్రమాదకరమై ‘నది’.. 

13 Jul, 2021 15:53 IST|Sakshi

కోడేర్‌ (కొల్లాపూర్‌): నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం ఖానాపూర్‌ శివారులో మిషన్‌ భగీరథ గేటు వాల్వ్‌కు లీకేజీ ఏర్పడింది. సోమవారం అది పెద్దదై మూడు గంటల పాటు నీళ్లు వృథాగా పోయాయి.

పొలాల్లో ఉన్న రైతులు గమనించి వెంటనే ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు ప్రారంభించారు. మంగళవారంలోగా మరమ్మతు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
 

ఇల్లెందు: పనికెళ్లాలంటే వాగు దాటాల్సిందే. సోమవారం పొద్దుటే వ్యవసాయ పనులకు వెళ్లిన గిరిజనులు సాయంత్రం తిరిగి వచ్చే వేళకు కిన్నెరసాని నది పొంగింది. దాన్ని దాటితేనే ఇంటికి చేరేది.. చేసేదేం లేక ఇలా కట్టెల సాయంతో నిచ్చెన మాదిరి ఏర్పాటు చేసుకుని ప్రవాహాన్ని దాటడానికి సాహసం చేశారు.

ఇదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మొదుగులగూడెం గిరిజనుల పరిస్థితి. మొదుగులగూడెం – నడిమిగూడెం మధ్య కిన్నెరసానిపై ఎలాంటి వారధి లేకపోవడంతో ఏటా వర్షాకాలంలో ఇలాంటి కష్టాలు షరామామూలయ్యాయి.

ఉడుము.. పట్టు 
మహాముత్తారం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని అటవీ గ్రామాలైన కనుకునూర్, రెడ్డిపల్లి, సింగంపల్లి, రేగులగూడెం, సింగారం తదితర గ్రామాల్లోని గిరిజనులు అడవుల్లో దొరికే ఉడుములను అమ్మడం ద్వారానే జీవనోపాధి పొందుతున్నారు. దీని మాంసం నడుము, కీళ్లనొప్పుల్లాంటి వ్యాధులకు బాగా పనిచేస్తుందనే నమ్మకం ఉంది. ఈ క్రమంలో కేజీ మాంసం రూ.800 వరకు పలుకుతోంది. దీనిపై పెగడపల్లి ఫారెస్ట్‌ రేంజర్‌ సుష్మారావు మాట్లాడుతూ ఉడుములను పట్టడం నేరమని, అటువంటి వారిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు.

            


 

మరిన్ని వార్తలు