కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హైకోర్టులో పిల్‌ దాఖలు

19 Jan, 2021 14:39 IST|Sakshi

హైదరాబాద్‌: పంప్‌లైన్‌‌ విధానం ద్వారా 3 టీఎంసీల నీటిని తరలించడాన్ని సవాల్‌ చేస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. తెలంగాణ ఇంజినీర్‌ ఫోరమ్‌ కన్వీనర్‌ దొంతుల లక్ష్మీ నారాయణ ఈ పిల్‌ను దాఖలు చేశారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది మాచర్ల రంగయ్య కోరిన అత్యవసర విచారణను కోర్టు నిరాకరించి, మరోసారి అప్లికేషన్ పెట్టుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. కాగా, పంప్‌లైన్‌ విధానం ద్వారా నీటిని తరలిస్తే ప్రభుత్వంపై ఏటా రూ.8 వేల కోట్ల అదనపు భారం పడుతుందని పిటిషనర్‌ కోర్టుకు విన్నవించారు. నీటి తరలింపు ప్రక్రియను పాత పద్ధతినే కొనసాగించాలని ఆయన కోర్టును కోరారు.

ఇప్పటిదాకా 2 టీఎంసీల నీటిని కెనాల్ గ్రావిటేషనల్ టన్నెల్ అండ్ లిఫ్ట్‌ సిస్టం ద్వారా తరలించారన్న పిటిషనర్.. ప్రతి ఏటా ప్రభుత్వంపై వేల కోట్ల నిర్వహణ భారం పడుతుందని కోర్టుకు వివరించారు. పంప్‌లైన్ పద్ధతి ద్వారా నీటిని తరలిస్తే భూసేకరణ సమస్యతో పాటు, విద్యుత్ తదితర సమస్యలు ఎదురవుతాయన్నపిటిషనర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశించిందని పిటిషనర్ కోర్టుకు వివరించారు. గతంలో మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు కాలువల ద్వారానే నీటి సరఫరా జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు