ప్లాస్మా దానం.. ప్రాణదానమే

4 Oct, 2020 04:11 IST|Sakshi
ప్లాస్మా దాతల సన్మాన కార్యక్రమంలో గూడూరు, సంగీతారెడ్డి, గురువారెడ్డి

ప్లాస్మా డోనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గూడూరు

ప్లాస్మా దాతలకు హైదరాబాద్‌లో ఘన సన్మానం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితులకు అం డగా కోవిడ్‌ జయించిన వ్యక్తులు నిలవడం అభినందనీయమని తెలంగాణ ప్లాస్మా డోనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ప్లాస్మా దానం చేయడమంటే కోవిడ్‌ బాధితులకు ప్రాణదానం చేయడమేనన్నారు. శనివారం హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్లాస్మా దాతలను ఘనంగా సన్మానించారు. అపోలో చైర్‌ పర్సన్‌ సంగీతారెడ్డి, సన్‌షైన్‌ హాస్పిటల్‌ చైర్మన్‌ గురువారెడ్డిల చేతుల మీదు గా 50 మంది ప్లాస్మా దాతలకు సన్మానం చేసి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తాను, కరోనా బాధితులకు ప్లాస్మాదానం చేయించడం ద్వారా అండగా నిలవాలని భావించి  అసోసియేషన్‌ ఏర్పాటు చేశానన్నారు. గత రెండు నెలలుగా అసోసియేషన్‌ నేతృత్వంలో ప్లాస్మా దాతల సమీకరణకు కృషి చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు 800 మంది నుంచి ప్లాస్మా సేకరించి, 1,200 మంది కోవిడ్‌ బాధితులకు ఇప్పించినట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా గూడూరు చేస్తున్న కృషిని పలువురు ప్లాస్మా దాతలు అభినందించారు.

మరిన్ని వార్తలు