సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశంలో సమానత్వం పెంపొందించి, ప్రజల అభ్యున్నతికి అంబేడ్కర్ కృషి చేశారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేవిధంగా, అంబేడ్కర్ ఆశయాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పని చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎం.ఎస్.ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్, గరపు దయానంద్, జనార్ధన్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ డా.నరసింహాచార్యులు, టిఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.