హిజ్రాను వేధింపులకు గురిచేస్తున్న భర్త అరెస్టు

17 Apr, 2021 14:07 IST|Sakshi
భర్త నాగేందర్‌

సాక్షి, కుషాయిగూడ: ఇష్టపడి ఓ హిజ్రాను పెళ్లి చేసుకొని వేధింపులకు గురిచేస్తున్న భర్తపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన బండారి నాగేందర్‌ (32),  మల్లాపూర్, నేతాజీనగర్‌కు చెందిన గుత్తికొండ దివ్య (32) అనే హిజ్రాకు స్నేహం కుదిరింది. 2019 వరంగల్‌ మేడారం జాతరలో దివ్యను చూసిన నాగేందర్‌ 2019 నవంబరులో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. ఏడాది పాటుగా ఆనందంగా గడిపారు.

గత కొన్ని రోజులుగా వైష్ణవి అనే అమ్మాయిపై మోజు పెంచుకొని తనను వేధించడం మొదలుపెట్టాడని దివ్య పోలీసుల ఎదుట వాపోయింది. ఆమెను వివాహం చేసుకొని తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటానని అందుకు అంగీకరించమంటూ మానసికంగా, శారీరకంగా వేధించినట్లు పోలీసులకు తెలిపింది. అంతే కాకుండా నాగేందర్‌ తల్లి శోభ, అక్క అఖిలవాణి తరచుగా ఫోన్‌ చేసి అసభ్య పదజాలంతో తనను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వేంధిపులకు పాల్పడుతున్న నాగేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు