సిద్ధిపేట: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. విమర్శలు ఎక్కుపెడుతోంది. తాజాగా సిద్ధిపేటలో జరిగిన ఓ ఘటనను దానికి ముడిపెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. అయితే.. జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి సృష్టించిన అలజడిపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. బిల్బోర్డ్ ఫ్రేమ్ను పట్టుకుని ఓ వ్యక్తి ఊగిసలాడడం, డబుల్ బెడ్రూం ఇళ్ల కోసమే అతనలా చేశాడంటూ జరిగిన ప్రచారం అంతా నిజం కాదని సిద్ధిపేట పోలీసులు స్పష్టత ఇచ్చారు.
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో బుధవారం నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి.. బిల్బోర్డ్ పట్టుకుని వేలాడుతూ అధికారులకు చుక్కలు చూపించాడు. దానికి తోడు అతని వ్యవహారంతో ట్రాఫిక్ ఝామ్ అయ్యింది. అయితే.. ఎలాగోలా అతన్ని కిందకు దించారు పోలీసులు. దీనిపై మంత్రి హరీష్రావు ఏమంటారంటూ బీజేపీ విమర్శకు దిగింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిరసనలో భాగమే ఇదంటూ ప్రచారం చేసింది.
అయితే.. ఆ వ్యక్తి తప్పతాగి వీరంగం వేశాడని పోలీసులు స్పష్టత ఇచ్చారు. ‘‘బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. తాగిన మత్తులో సోయిలేక ఆ వ్యక్తి అలా చేశాడు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసమో మరేయితర దాని కోసమో అతను అలా చేయలేదు. కిందకు దించి అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాం. అలాగే అతనిపై న్యూసెన్స్ కేసు నమోదు చేశాం’’ అని సిద్ధిపేట కమిషనర్ శ్వేత మీడియాకు వెల్లడించారు.
This is the Situation in #Siddipet
Mr.@trsharish Do you have an Answer?@BRSparty #KCRFailedTelangana
— Maruthi (@Maruthi0305) January 11, 2023
pic.twitter.com/u5yzfRv5FD