డబ్బులు ఇవ్వకపోతే నీ ఇళ్లు కూల్చివేయిస్తా..

19 Aug, 2021 09:33 IST|Sakshi

సాక్షి,నల్లకుంట: ఓ ఇంటి నిర్మాణంలో ఇంటి యజమానిని బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్‌ చేసిన ముగ్గురిపై నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ మొగిలిచర్ల రవి కథనం ప్రకారం.. ఎన్‌.సత్యనారాయణ మూర్తి పాత నల్లకుంటలో ఇంటి నంబర్‌ 1–8–726/డీ  నిర్మాణం చేపట్టారు. జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు లేకుండా ఇంటి పై అంతస్తు నిర్మాణం చేపడుతున్నారంటూ ఎన్‌.అదిశ్రీ, కోనేటి శ్రీనివాస్, మరో వ్యక్తి ఎ.సుదర్శన్‌ బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

తమకు డబ్బులు ఇవ్వకపోతే జీహెచ్‌ఎంసీ అధికారులతో ఇళ్లు కూల్చివేయిస్తానంటూ బెదిరించారు. ఇంటి నిర్మాణం కోసం అవసరమైన రుణం కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకోగా రుణం మంజూరు చేయకుండా బ్యాంక్‌ అధికారులకు తప్పుడు సమాచారమిచ్చారు. దీంతో ఆదిశ్రీ , శ్రీనివాస్, సుదర్శన్‌ల వల్ల తనకు ప్రాణహాని ఉందని  సత్యనారాయణ మూర్తి మంగళవారం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: కోర్టు తీర్పును టైప్‌ చేస్తున్న స్టెనోగ్రాఫర్‌.. అంతలోనే..

మరిన్ని వార్తలు