మహిళలపై నేరాలకు సైబర్‌ ల్యాబ్‌తో చెక్‌: డీజీపీ

17 Jul, 2021 02:06 IST|Sakshi

పోలీసు శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: మహిళలు, చిన్నారులపై జరిగే సైబర్‌ నేరాలను అరికట్టేందుకు సైబర్‌ ల్యాబ్‌ దోహ దపడుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ తరహా నేరాలను నివారించేందుకు రాష్ట్ర పోలీసుశాఖలో సైబర్‌ ల్యాబ్‌ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర మహిళాభద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్‌ ల్యాబ్‌పై మహిళా భద్రత విభాగం అడిషనల్‌ డి.జి.స్వాతిలక్రా, సైబర్‌ ఇంటెలిజెన్స్, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ పరిశోధనాకేంద్రం (సి.ఆర్‌.సి.ఐ.డి.ఎఫ్‌) అధికారుల మధ్య కుదిరిన అవగాహనాఒప్పందంపై శుక్రవారం డీజీపీ సమక్షంలో సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమంలో డి.ఐ.జి సుమతి, సి.ఆర్‌.సి.ఐ.డి.ఎఫ్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ పాటిబండ్ల తదితరులు హాజరయ్యారు. డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 50 శాతమున్న మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, దీనిలో భాగంగానే సైబర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి ఫిర్యాదులు అందినప్పుడే వాటిని అరికట్టడం సాధ్యమవుతుందని, సైబర్‌ నేరాలపట్ల ప్రజల్లో అవగాహన కలి్పంచేందుకు సైబర్‌ ల్యాబ్‌ చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. 2020–21ను సైబర్‌ సేఫ్టీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సైబర్‌ నేరాల నియంత్రణ, పరిష్కారానికి సైబర్‌ ల్యాబ్‌ దోహదపడుతుందని స్వాతిలక్రా అన్నారు.  వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌ స్ట్రాగాం, ట్విట్టర్‌ తదితర సామాజిక మాద్యమాల ద్వారానే ఈ నేరాలు జరుగుతున్నాయని వెల్లడించారు. మహిళలు, పిల్లలపై నేరాల నియంత్రణ, దేశంలోనే తొలిసారిగా ఈ సైబర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. 

మరిన్ని వార్తలు