కొండగట్టు ఆలయంలో చోరీ.. దొంగలు ఎవరంటే?

27 Feb, 2023 10:56 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణలో ప్రముఖ ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. కాగా, చోరీ కేసును పోలీసులు చేధించారు. ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. సదరు దొంగను కర్నాటకలోని బీదర్‌లో పట్టుకున్నారు. వీరంతా మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌ సమీపంలోని ఓ తండాకు చెందిన గ్యాంగ్‌గా గుర్తించారు.

వివరాల ప్రకారం.. కొండగట్టు ఆలయంలో గత శుక్రవారం దొంగతనం జరిగింది. తొమ్మిది లక్షల విలువైన మకర తోరణం శఠగోపాలు, వెండి తొడుగు, వెండి వస్తువులు మొత్తం 15 కిలోల వెండి అపహరించారు. కాగా, ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. చోరీ కోసం దొంగలు.. శుక్రవారం అర్ధరాత్రి 1.20 గంటలకు ఆలయం వెనుక నుంచి గుడిలోకి వెళ్లి దొంగతనం చేసి.. ఆ తర్వాత వెనుక వైపు నుంచి గుట్ట కిందకు దిగి వెళ్లిపోయినట్టు గుర్తించారు.  

అనంతరం, మెయిన్‌రోడ్డుకు వెళ్లి బైకులపై కోరుట్ల, మెట్‌పల్లి మీదుగా కామారెడ్డి, నారాయణ్‌ ఖేడ్‌ నుండి బీదర్‌ వెళ్లినట్టు పోలీసులు ట్రాక్‌ చేశారు. ఇక, ఈ దొంగతనానికి ఎనిమిది ఉన్న ఓ గ్యాంగ్‌ ప్లాన్‌ చేసినట్టు గుర్తించారు. ప్రస్తుతానికి వారి వద్ద నుంచి 60 శాతం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆభరణాలు మొత్తం రికవరీ అయ్యాక ఈ ఘటన గురించి పోలీసులు వివరాలు తెలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

>
మరిన్ని వార్తలు