టీఎస్‌ అసెంబ్లీ: అక్బరుద్దీన్‌ Vs కేసీఆర్‌ సర్కార్‌.. హీటెక్కిన సభ

4 Feb, 2023 11:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాసనసభ వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగాన్ని కేబినెట్‌ ఆమోదించిందా? అని ప్రశ్నించారు. 

కాగా, అక్బరుద్దీన్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌ తమిళిసై ప్రసంగంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటూ ఎందుకు నిలదీయలేదు?. గవర్నర్‌ ఏమైనా మార్పులు, చేర్పులు సూచించారా?. గవర్నర్‌ ప్రసంగాన్ని కేబినెట్‌ ఆమోదించిందా?. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా ఉంది అని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఆరోపణలపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి స్పందించారు. కేబినెట్‌లో జరిగిన ప్రతీ విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు అంటూ రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చారు. 

ఇదే సమయంలో పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని అక్బరుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు ఇస్తారు.. అమలు చేయరు. చర్చ సమయంలో సభా నాయకుడు కనిపించడం లేదు. సీఎం కేసీఆర్‌, మంత్రులు ఎవరినీ కలవరు. పాతబస్తీకి మెట్రో రైలు ఏమైంది?. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితేంటి?. మీరు చెప్రాసిని చూపిస్తే వారినైనా కలుస్తాము. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు టీవీ డిబెట్లకు వెళ్లే టైముంది.. కానీ, సభకు వచ్చే సమయం లేదా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎంఐఎం నేతలు బీఏసీ సమావేశానికి ఎందుకు రాలేదు?. అక్బరుద్దీన్‌ సబ్జెక్ట్‌ తెలియకుండా మాట్లాడుతున్నారు. సభా నాయకుడితో​ ఒవైసీకి ఏం సంబంధం?. ఏవైనా సమస్యలు ఉంటే బడ్జెట్‌ సెషన్‌లో చెప్పుకోవాలి.  ఆవేశంతో మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు అంటూ కౌంటర్‌ ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు