పాలిసెట్‌లో 81.75 శాతం ఉత్తీర్ణత

29 Jul, 2021 01:00 IST|Sakshi

92,557 మంది హాజరు.. 75,666 మంది పాస్‌ 

వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డులు 

త్వరలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: పాలిసెట్‌–21 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ బుధవారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 17న జరిగిన పాలిసెట్‌–21 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,02,496 మంది దరఖాస్తు చేసుకోగా, 92,557 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 81.75శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.. అంటే 75,666 మంది పాసయ్యారు. వీరిలో బాలురు 39,186, బాలికలు 33,071 మంది ఉన్నారు. సాధారణంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పాలిసెట్‌ పరీక్షను నిర్వహిస్తుండగా... కోవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో పదోతరగతి బోర్డు పరీక్షలు నిర్వహించకపోవడంతో బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలు సైతం ఈ సెట్‌ ఫలితాల ఆధారంగా నిర్వహిస్తున్నారు.

అతి త్వరలో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీ వేర్వేరుగా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. పాలిసెట్‌లో సాధించిన మార్కులు, ర్యాంకులకు సంబంధించిన సమాచారం, ర్యాంకు కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు సాంకేతిక విద్యా కమిషనర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు