పేగులపై పోస్ట్‌ కోవిడ్‌ ఎఫెక్ట్‌.. ఈ సమస్యలుంటే అప్రమత్తం కావాల్సిందే

3 Oct, 2021 01:53 IST|Sakshi

దీర్ఘకాల కరోనా బాధితుల్లో బయటపడుతున్న పేగుల్లో గ్యాంగ్రీన్‌ లక్షణాలు

వారంలోనే నిమ్స్‌ సహా ప్రైవేటు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో కేసులు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నుంచి కోలుకున్న వారితోపాటు ఇప్పటిదాకా వైరస్‌బారిన పడని వారు సైతం కొత్త అనారోగ్య సమస్యలపట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపు నొప్పి, వాంతులు, నీళ్ల విరేచనాలు, నల్లరంగులో మలం, మూత్రంలో రక్తపు చారల వంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా నల్ల రంగులో మలవిసర్జన వల్ల చిన్న, పెద్ద పేగుల్లో గ్యాంగ్రీన్‌ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నం దున జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. పోస్ట్‌ కోవిడ్‌ లేదా లాంగ్‌ కోవిడ్‌ బాధితుల్లో రక్తం గడ్డకట్టే తత్వం పెరుగుతోందని వైద్యులు గుర్తించారు.

దీన్ని వైద్య పరిభాషలో ‘హైపర్‌ కోఅగ్యుల బుల్‌’లేదా ‘ప్రోత్రోంబొటిక్‌’గా పిలుస్తున్నట్లు పేర్కొన్నారు. తాజాగా వారం వ్యవధిలోనే నిమ్స్‌ ఆసుపత్రిలో ఏడు కేసులు, ఏఐజీ, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్ని కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన వైద్యులు గతంలో వీరేమైనా కోవిడ్‌ బారిన పడ్డారా అని ఆరా తీశారు. వీరిలో చాలా మంది తమకు కరోనా సోకలేదని స్పష్టం చేయడంతో తదుపరి పరీక్షలు నిర్వహించారు. వీరికి నిర్వహించిన టెస్ట్‌ల్లో కోవిడ్‌ యాంటీబాడీస్‌ గణనీయంగా ఉన్నట్లు వెల్లడైంది. దీనిని బట్టి ఈ పేషెంట్లకు కరోనా వచ్చిపోయి ఉంటుందని, అది సోకినా లక్షణాలు కనిపించని (అసింప్టోమేటిక్‌) వారిగా గుర్తించారు. ఇటీవలి కాలంలో ఈ లక్షణా లకు సంబంధించిన కేసులు నమోదు అవుతుండడంతో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిమ్స్‌ ప్రొఫెసర్, సర్జికల్‌ గ్యాస్ట్రో ంటరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌. బీరప్ప పేర్కొ న్నారు. దీనితో ముడిపడిన వివిధ అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ‘సాక్షి’తో పంచుకున్నారు. ముఖ్యాంశాలు... ఆయన మాటల్లోనే... 

ఎలా నిర్ధారించారు...? 
ఈ పేషెంట్లలో కోవిడ్‌ పాజిటివ్‌ యాంటీబాడీస్‌ ఏర్పడ్డాయి కాబట్టి ఇది కరోనా సంబంధితమైనదిగా నిర్థారించాం. లాంగ్‌ కోవిడ్‌ లక్షణాల్లో భాగ ంగా రక్తనాళాలతో ముడిపడిన వివిధ సమస్యలు తలెత్తవచ్చు. పేగులకు రక్తప్రసారాన్ని తీసుకెళ్లే సిరలు, ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి అకస్మాత్తుగా కంటిచూపు పోవడం, గుండెపోటు, గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, శరీరంలో ఎక్కడైనా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం సంభవించే అవకాశాలున్నాయి. అలాగే చిన్న, పెద్ద పేగులకు రక్తం సరఫరా చేసే నాళాల్లో రక్తం గడ్డకట్టాక అవి కుళ్లిపోయి ‘గ్యాంగ్రీన్‌’లు ఏర్పడుతున్నాయి.

ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం... 
కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురైన వారు, దీర్ఘకాలిక జబ్బులున్నవారు, బీపీ, ఊబకాయం, గుండె సంబంధిత జబ్బులు, ఎక్కువకాలం ఎటూ కదలకుండా ఒకేచోట గడిపే వారికి ఈ థ్రోంబొటిక్‌ సమస్యలు తీవ్రం కావొచ్చు. ఈ సమస్య అత్యధికంగా పురుషులకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. ఈ లక్షణాలను వీలైనంత తొందరగా గమనించి చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

రక్తం పలుచన చేసే మందులు ఇవ్వాలి... 
కరోనా వచ్చి తగ్గిన వారికి డాక్టర్లు సుదీర్ఘకాలంపాటు రక్తాన్ని పలుచన చేసే ‘యాంటీ కోవిలియెంట్స్‌’ఇవ్వాల్సి ఉంటుందని భావిస్తున్నాం. గతంలో ఈ మందులను స్వల్పకాలం ఇస్తే సరిపోతుందనే అంచనా ఉండగా ఇప్పుడు దానిని మార్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నాం.

‘హైపర్‌ కోఅగ్యులబుల్‌’ అంటే..
కరోనా బారిన పడ్డాక కొందరిలో రక్తం గడ్డ కడు తోంది. పేగుల్లో బ్లాక్స్‌ (ఇంటెస్టెయిన్స్‌ బ్లాక్స్‌) ఏర్పడతాయని మనకు గతేడాది అవగతమైంది. వ్యాక్సిన్‌ దుష్పరిణామాల వల్ల ఇలా జరిగి ఉంటుందా అంటే అదీ కాదని తేలింది. వీరిలో కొందరు సింగిల్‌డోస్‌ తీసుకున్నారు. కోవిడ్‌ ఫస్ట్, సెకండ్‌వేవ్‌లలో ఇలాం టి కేసులు చాలా తక్కువగా నమోదు అయ్యా యి. ‘హైపర్‌ కోఅగ్యులబుల్‌’లక్షణాలు, ప్రభా వాలు ఏర్పడినప్పుడు బ్రెయిన్‌ స్ట్రోక్, హార్ట్‌ అటాక్, అంతర్గత అవయవాలు, కాళ్లకు రక్త సరఫరా చేసే నాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశాలున్నాయి.

మేము దీనిని ‘స్లాంపషినిక్‌ వీన్‌ థ్రోం బోసిస్, పోర్టోమెసెంట్రిక్‌ వీన్‌ థ్రోంబోసిస్, మెసెంట్రిక్‌ ఇస్కేమియాగా పిలుస్తాం. ఇటీవలి కాలంలో నిమ్స్‌లో ఇలాంటి కేసులు పెరిగాయి. ముఖ్యంగా యువతలో, గతంలో ఎలాంటి దీర్ఘకాలిక, ఇతర జబ్బులు (కోమొర్బోటీస్‌)లేని వారి లోనూ గుర్తించాం. కొందరు పేషెంట్ల చిన్న పేగులో అత్యధికభాగం, పెద్దప్రేగులో కొంత భాగం కుళ్లిపోయి ఇన్ఫెక్షన్‌ బాగా పెరిగింది. అది కాస్తా ‘రెనల్‌ ఫెయిల్యూర్‌’కి వెళ్లింది. ఆరుగురు పేషెంట్లలో గ్యాంగ్రీన్‌ విస్తరణతో పేగులో చాలా భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. ఆరోగ్యం క్షీణించి ఇద్దరు మరణించారు. నలుగురిని వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చింది. 

మరిన్ని వార్తలు