స్కూళ్లకు విద్యుత్‌ మీటర్ల షాక్‌..!

16 Dec, 2020 02:02 IST|Sakshi

ప్రభుత్వ స్కూళ్లలో స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు బిగిస్తున్న విద్యుత్‌ శాఖ

ఆ మీటర్లకు అయ్యే మొత్తాన్ని చెల్లించాలని పాఠశాలలకు నోటీసులు

ఆ డబ్బు ప్రధానోపాధ్యాయులు చెల్లించాలని ఆదేశం

స్కూల్‌ విద్యుత్‌ చార్జీలకే దిక్కులేదు.. మీటర్ల బిల్లులా అంటూ ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్‌ మీటర్ల షాక్‌ తగిలింది. గతేడాది నుంచి బిగిస్తున్న ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లకు అయ్యే ఖర్చు చెల్లించాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యుత్‌ శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక ప్రధానో పాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. అసలు పాఠశాలల విద్యుత్‌ చార్జీలు చెల్లించేందుకే పాఠశాల విద్యా శాఖ సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదని ఆందోళన చెందు తుంటే.. ఇప్పుడేమో విద్యుత్‌ మీటర్ల చార్జీలు చెల్లించాలంటే ఆదేశిస్తే.. ఏం చేయాలంటూ డీఈవోలకు ప్రధానో పాధ్యాయులు మొర పెట్టుకుంటున్నారు. సింగిల్‌ ఫేజ్‌ స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్‌ ఒక్కో దానికి రూ.8,687 చెల్లించాలని ఆదేశిం చింది. రాష్ట్రంలోని 30,601 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్‌ మీటర్ల ఖర్చు కిందే రూ.26.50 కోట్లకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. దీంతో ఏం చేయాలన్న విషయంలో విద్యా శాఖ ఉన్నతాధికారులు కూడా తలలు పట్టుకున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకే.. 
ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ప్రీపెయిడ్‌ మీట ర్లను బిగిస్తున్నామని విద్యుత్‌ శాఖ స్పష్టం చేసింది. అందులో భాగంగానే కొన్ని పాఠశాలల్లో మీటర్లు బిగించించామని, మిగతా పాఠశాలల్లోనూ స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు బిగిస్తున్నామని స్పష్టం చేసింది. వాటికయ్యే ఖర్చును ప్రధానోపాధ్యా యులు/ సంబంధిత అధికారులు చెల్లించాలని పాఠశాలలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న నెల రోజుల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆయా నోటీసుల్లో స్పష్టం చేసింది. లేదంటే ఆ తర్వాత మూడు నెలల విద్యుత్‌ బిల్లులో ఆ మొత్తాన్ని వేసి వసూలు చేస్తామని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం పాత మీటర్లతో వినియోగించిన విద్యుత్‌ చార్జీలనే మంజూరు చేయడంలో విద్యా శాఖ జాప్యం చేస్తోందని, ఇప్పుడు కొత్త మీటర్లకు డబ్బులు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఆ మొత్తాన్ని మంజూరు చేయాలని ప్రధానో పాధ్యాయులు కోరుతున్నారు. 

8,687 ఒక్కో సింగిల్‌ ఫేజ్‌ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్‌ ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు (రూ.లలో)

26.50రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు (రూ. కోట్లలో)

మరిన్ని వార్తలు