నాంపల్లి రైల్వేస్టేషన్‌లో మహిళ ప్రసవం

25 Feb, 2023 02:48 IST|Sakshi
శిశువును చూపుతున్న కానిస్టేబుల్‌ కళ్యాణి

నాంపల్లి: హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్‌ మహరాజ్‌ గంజ్, బూస్పేర్‌ ప్రాంతానికి చెందిన గర్భిణి ఆసియా ఖాతూన్, భర్త అసబుద్దీన్‌తో కలిసి గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సొంతూరుకు వెళ్లేందుకు సిద్ధమై నాంపల్లి రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారం–3 మీద రైలు కోసం వేచి చూస్తున్నారు.

ఇంతలోనే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అక్కడే విధుల్లో ఉన్న జీఆర్‌పీ ఆర్పీఎఫ్‌ పోలీసులు ఈ విషయం గమనించారు. అంబులెన్స్‌లో నిలోఫర్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈలోపే ఆమె మూడు కిలోల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చింది. మహిళా కానిస్టేబుల్‌ కళ్యాణి.. ఆసియా ఖాతూ న్‌ వెంట ఉండి అన్ని రకాల సేవలు అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు