ఎమ్మెల్యేల కేసులో మరో ట్విస్ట్‌.. కోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత

14 Nov, 2022 12:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న వేళ అనూహ్య పరిణామం జరిగింది. ఈ కేసులో సిట్‌ దర్యాప్తును సవాల్‌ చేస్తూ బీజేపీ నేత గుజ్జల ప్రేమేందర్‌ రెడ్డి.. హైకోర్టులో పిటిషన్‌ వేశారు. గతంలో సింగిల్ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్‌ బెంచ్‌లో రిట్‌ అప్పీల్‌ చేశారు.

దీంతో, రిట్‌ అప్పీల్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను రేపటి(మంగళవారం)కి వాయిదా వేసింది. మరోవైపు తాను దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రేమేందర్‌ రెడ్డి.. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదన్నారు. ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. 

ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణ హైకోర్టులో ఉన్న నేపథ్యంలో నిందితులు.. కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ క్రమంలో ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు