‘వ్యాక్సిన్‌’ పాలసీ సిద్ధం చేయండి

7 Aug, 2020 04:32 IST|Sakshi

లైసెన్సింగ్‌ ప్రక్రియకు మార్గదర్శకాలు రూపొందించాలి

కరోనా వ్యాక్సిన్‌ తయారీ సంస్థల కోసం ప్రత్యేక నిధి ఉండాలి

కేంద్రానికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ త్వరలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశమున్నందున అందరికీ అందుబాటులో ఉండే లా కేంద్ర ప్రభుత్వం ‘వ్యాక్సిన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ’ని సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. వ్యాక్సిన్‌ తయారీ సంస్థకు పీఎం కేర్స్‌ నుంచి రూ.100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో మార్గదర్శకాలు రూపొందించడంతోపాటు, వ్యాక్సిన్‌ తయారీలో ముం దు వరుసలో ఉన్న కంపెనీలకు మరింత ఫండింగ్‌ కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు గురువారం కేటీఆర్‌ లేఖ రాశారు.  

వ్యాక్సిన్‌ రాజధానిగా.. 
‘ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధాని గా ఉన్న హైదరాబాద్‌ ఏటా 5 బిలియన్‌ డోసులు తయారీ ద్వారా ప్రపంచంలో మూడో వంతు వ్యాక్సిన్‌ ఉత్పత్తి చే స్తోంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీకి స్థానికంగా మూడు కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలు త్వరలో ఫలితాన్నిస్తాయి. కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను స్థానిక ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్నాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ లైసెన్సింగ్‌ ప్రక్రియకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎఫ్‌డీఏఏ వంటి సంస్థలు చేసిన మార్గదర్శకాలు, ప్రమాణాలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించడం ద్వారా దేశంలో వ్యాక్సిన్‌ తయారీ వేగవంతమవుతుంది’ అని కేటీఆర్‌ అన్నారు.

అలాగే, భారత్‌లో వ్యాక్సిన్‌ల తయారీ కోసం ఆరు కేంద్ర ప్రభుత్వ శాఖలతోపాటు, రాష్ట్ర స్థాయిలో అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. అనుమతులు, క్లియరెన్సుల కోసం నిబంధనలు సరళతరం చేస్తూ కొత్త విధానం రూపొందించాలి. అనుమతులు, ట్రాకింగ్‌ వ్యవస్థను మరింత వికేంద్రీకరిస్తే క్లినికల్‌ ట్రయల్స్, వ్యాక్సిన్ల తయారీ మరింత సులభతరమవుతుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలీలో ఉన్న సెంట్రల్‌ డ్రగ్‌ లేబొరేటరీకి శాంపిళ్లను పంపేందుకు బయోటెక్‌ పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. హైదరాబాద్‌లో ఈ జోనల్‌ కార్యాలయం ఏర్పాటు చేయడం హర్షనీయం అని కేటీఆర్‌ అన్నారు.

మరిన్ని వార్తలు