హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

26 Dec, 2022 17:39 IST|Sakshi

హైదరాబాద్‌: శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి వచ్చారు. దీనిలో భాగంగా కర్నూలు నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు వచ్చారు. రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్‌ తమిళ సై, సీఎం కేసీఆర్‌లు స్వాగతం పలికారు. ఐదు రోజుల పాటు రాష్ట్రపతి ఇక్కడే బస చేయనున్నారు.  దాంతో బొల్లారంలోని ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌ ఆవరణలోని రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాలను భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. 

కాగా, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌తో పాటు సిమ్లా, హైదరాబాద్‌లోనూ రాష్ట్రపతి అధికారిక నివాసాలున్నాయి. శీతాకాలంలో  కొన్ని రోజులు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయడంతో పాటు ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించడం ఆనవాయితీ. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌తో పాటు దాదాపు అందరు రాష్ట్రపతులూ ఇక్కడ బస చేశారు. కోవిడ్‌ ఇతర కారణాల రీత్యా మూడేళ్ల పాటు రాష్ట్రపతి హైదరాబాద్‌ నివాసానికి రాలేదు. చివరిసారిగా 2019 డిసెంబర్‌లో నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. రెండేళ్ల విరామానంతరం ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు విడిది కోసం వచ్చారు.

చదవండి:  ఐదురోజుల పాటు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు... ఈ మార్గాల్లోనే
 

మరిన్ని వార్తలు