ఫీజు కట్టకపోతే నీ సీటు రద్దవుతుంది.. స్వయంగా ప్రిన్సిపాలే రాసి ఇచ్చి..

2 Sep, 2022 13:16 IST|Sakshi
ప్రిన్సిపల్‌ రాసి సంతకం పెట్టిన దృశ్యం  

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత తరగతుల విద్యార్థులకు సైతం ఫీజుల వేధింపులు తప్పడం లేదు. ఏకంగా ఫీజులు చెల్లించక పోతే అడ్మిషన్‌తోపాటు సీటు రద్దు చేస్తామని ఒత్తిళ్లు చేస్తున్న వైనం వెలుగు చూసింది. ఏపీలో  అనుమతులు పొంది, తెలంగాణలో యుజీసీ ప్రత్యేక ఆర్డర్‌తో నగర శివార్లలోని కొండాపూర్, అజీజ్‌ నగర్, మియాపూర్‌లో వివిధ కోర్సుల తరగతులు నిర్వహిస్తొంది ఒక డీమ్డ్‌ యూనివర్సిటీ. నగరానికి చెందిన ఒక విద్యార్థి  ఆ యూనివర్సిటీలోని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులో చేరారు.

కోర్సుకు రూ. 1,85,000 ఫీజు పేర్కొనడంతో ఈ ఏడాది  ఏప్రిల్‌ 24న  మొదటి విడతగా రూ. 50  వేలు  చెల్లించి అడ్మిషన్‌ తీసుకొని తరగతులకు హాజరు అవుతున్నారు కాగా తాజాగా పూర్తి ఫీజు చెల్లించాలని విద్యార్థిపై ఒత్తిళ్లు ప్రారంభయ్యాయి. కాగా, గురువారం ఏకంగా ప్రిన్సిపాల్‌ తక్షణమే ఫీజు చెల్లించకుంటే సీటు రద్దు అవుతుందని లిఖిత పూర్వకంగా రాసి సంతకం చేసి విద్యార్థికి ఇవ్వడం విస్మయానికి గురిచేసింది.  

ఫీజు కట్టకుంటే సీటు రద్దేంటి..? 
పూర్తి స్థాయి ఫీజు చెల్లించకుంటే సీటు రద్దు చేస్తామని ప్రిన్సిపాల్‌ లిఖిత పూర్వకంగా రాయడాన్ని టీఎస్‌టీసీఈఏ అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్‌ తప్పుబట్టారు. కనీసం గడువు ఇవ్వకుండా  ఈ రోజు ఫీజు  కట్టకపోతే సీటు రద్దు అవుతుందని పేర్కొనడం సమంజసంకాదన్నారు. విద్యార్థుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడం సరైంది కాదుని వెంటనే వారిని పిలిపించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు