సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సామాజిక విశ్లేషకుడు, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. గతంలో 2007, 2009లలో ఎమ్మెల్సీగా ఆయన విజయం సాధించారు. 2014 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల మద్దతుతో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీ చేసే అంశంపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వెలువడుతున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ స్పష్టత ఇచ్చారు.