అడవుల రక్షణకు పెద్దపులి సంరక్షణ అవసరం

2 Apr, 2023 08:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అడవుల రక్షణకు పెద్దపులి సంరక్షణ అవసరమని, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ తరపున పులుల రక్షణకు మద్దతు తెలుపుతున్నట్లు అడవులు, పర్యావరణంపై పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ చెప్పారు. దేశవ్యాప్తంగా అడవుల రక్షణ, పులుల సంరక్షణ కోసం కేంద్రం 1973లో ప్రాజెక్టు టైగర్‌ను ప్రవేశ పెట్టింది. శనివారం (ఏప్రిల్‌ 1) ఈ సేవ్‌ టైగర్‌ ఉద్యమానికి యాభై ఏళ్లు నిండాయి.

దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ టైగర్‌ కింద తీసుకున్న చర్యల వల్ల పులుల సంఖ్య పెరిగిందని సంతోష్‌ పేర్కొ న్నారు. 1973లో 1,827గా నమోదైన పులుల సంఖ్య 2022 నాటికి 2,967కు చేరగా.. టైగర్‌ రిజర్వుల సంఖ్య తొమ్మిది నుంచి 53కు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్‌ టైగర్‌ ప్రాధాన్యాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. సేవ్‌ టైగర్‌ ఉద్యమం గోల్డెన్‌ జూబ్లీ సందర్భంగా తెలంగాణకు చెందిన అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు విడుదల చేసిన టైగర్‌ బుక్, టీషర్ట్, కాఫీ మగ్‌ సావనీర్లను సంతోష్‌ ప్రదర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ ద్వారా అమ్రాబాద్, కవ్వాల్‌ పులుల అభయారణ్యాన్ని బాగా నిర్వహిస్తోందని, పులుల సంఖ్య పెరుగుతోందన్నారు. పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగాన ఉంటుందన్నారు. కార్యక్రమంలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రతినిధులు కరుణాకర్, రాఘవ, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

(చదవండి: ఇక తిరుపతికి ఎనిమిదిన్నర గంటల్లోనే.. వేగంగా వెళ్లేందుకే ఆ మార్గం ఎంపిక.. )

మరిన్ని వార్తలు