ఆగని మాస్టర్‌ ప్లాన్‌ మంటలు 

18 Jan, 2023 00:55 IST|Sakshi

ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దన్న ఎమ్మెల్యే సంజయ్‌  

జగిత్యాల: జిల్లాలో మాస్టర్‌ ప్లాన్‌ మంటలు మంగళవారం మరింత ఉధృతరూపం దాల్చాయి. పట్టణ సమీపంలోని మోతె, తిమ్మాపూర్, అంబారిపేట, నర్సింగాపూర్, ధరూర్, లింగంపేట, హస్నాబాద్‌ గ్రామాల్లో రైతులు, నాయకులు, ప్రజలు బల్దియా తీరుపై నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామాల్లోంచి ర్యాలీగా బయలు దేరి జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు చేరుకుని నిరసన తెలిపారు. తమ గ్రామాలను మాస్టర్‌ ప్లాన్‌ పరిధి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అంబారిపేట గ్రామపంచాయతీ కార్యాలయ భవనం ఎక్కిన మహిళలు.. నిరసన తెలిపారు. కాగా, ప్రతిపక్షాలు మాస్టర్‌ప్లాన్‌పై చేస్తున్న అసత్య, అర్థసత్య ప్రచారాలు నమ్మొద్దని, రైతులు, ప్రజలకు తాను వెన్నంటి ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ భరోసానిచ్చారు. అయితే, మాస్టర్‌ ప్లాన్‌ను కేవలం జగిత్యాల పట్టణం వరకే పరిమితం చేస్తే ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.  

మరిన్ని వార్తలు