Putta Madhu: ఇంటికి చేరుకున్న పుట్ట మధు

11 May, 2021 08:19 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు మంథనిలోని తన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయనను కలిసేందుకు అభిమానులు తరలివచ్చారు. కాగా పది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనను మే 8న రామగుండం పోలీసులు భీమవరంలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వామనరావు- నాగమణి దంపతుల హత్య కేసులో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.  మధుతో పాటు ఆయన భార్య శైలజను రెండు రోజుల పాటు విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ కుమారుడు ఆకాశ్‌ను సైతం పోలీసులు విచారించారు.

ఈ నేపథ్యంలో మూడు రోజుల విచారణ అనంతరం సోమవారం రాత్రి మధును వదిలేసిన పోలీసులు.. నేడు బ్యాంక్‌స్టేట్‌మెంట్లతో హాజరుకావాలని ఆదేశించారు.  కాగా హత్యకేసులో ప్రధాన నిందితులకు సుపారీ కింద రూ.2 కోట్లు ముట్ట జెప్పారని, ఏ 1 కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని ఆరోపిస్తూ వామన్‌రావు తండ్రి కిషన్‌రావు గత నెల 16న ఐజీ నాగిరెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధు, ఆయన కుటుంబసభ్యుల బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది బ్యాంక్ అకౌంట్ల స్టేట్‌మెంట్లు తీసుకున్నారు.

చదవండి: సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు

మరిన్ని వార్తలు