‘ఫాక్స్‌ సాగర్‌ చెరువుపై వదంతులు నమ్మొద్దు’

20 Oct, 2020 14:43 IST|Sakshi

చెరువు పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే

సాక్షి, హైదరాబాద్‌: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువును కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్ఎల్సీ శంభీపూర్ రాజు, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌తో కలిసి పరిశీలించారు. ఫాక్స్‌ సాగర్‌ చెరువు పరిస్థితిపై అధికారులతో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుమారు వందేళ్ల తర్వాత ఫాక్స్ చెరువులోకి భారీగా నీరు వచ్చిందన్నారు. సర్ ప్లస్ నీటిని బయటకు పంపించేందుకు తూము గేట్లు ఓపెన్ చేస్తున్నామన్నారు. ఇందుకు గాను శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద పని చేసే అనుభవం గలా సిబ్బందితో పనులు చేయిస్తున్నామన్నారు.
(చదవండి: ఎమ్మెల్యే వివేకానందపై వీఆర్‌ఓ ఫిర్యాదు)

అభివృద్ధి పనుల్లో భాగంగా తాము గతంలో చేపట్టిన చెరువు మరమ్మతు పనులతో ఫాక్స్ చెరువు గట్టు దృఢంగా ఉందని అన్నారు. తూము గేట్లు తెరిచినప్పటికీ లోతట్టు ప్రాంతాలు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. విడుదలైన నీటిని నాలలకు డైవర్ట్ చేస్తామని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. కొంత మంది చెరువు కట్టకు గండి పెడుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారం తగదని హితవు పలికారు. సుభాష్ నగర్ డివిజన్‌లో భారీ వర్షాలతో పలు కాలనీలు జలమయం కావడంతో అక్కడ వరద నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 
(చదవండి: మీర్‌పేట చెరువుకు గండి..ఆందోళనలో స్థానికులు)

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎటువంటి వదంతులు నమ్మవద్దన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. పోలీసులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ పద్మజా, మల్కాజిగిరి ఆర్డీఓ మల్లయ్య, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, గండిమైసమ్మ ఎమ్మార్వో భూపాల్, కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ ఏవీఆర్ నరసింహ రావు, పేట్ బషీరాబాద్ ఎస్ హెచ్ఓ రమేష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు