Paradise Biryani-Niloufer Chai: రాహుల్‌ గాంధీ లంచ్‌.. ప్యారడైజ్‌ బిర్యానీ.. నీలోఫర్‌ చాయ్‌!

8 May, 2022 17:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్ర పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నేతలకు రాహుల్‌ దిశానిర్దేశం చేశారు. వరంగల్‌ డిక్లరేషన్‌ గురించి విస్తృతంగా చర్చ జరిగేలా ప్రచారం చేయాలని సూచించారు.సుమారు రెండు గంటల పాటు గాంధీభవన్‌లో గడిపిన రాహుల్‌ గాంధీ చాలా ఉత్సాహంగా కనిపించారు. అందరినీ పలకరిస్తూ, ఫొటోలు, సెల్ఫీలు దిగారు. మధ్యాహ్నం 1:53 గంటలకు రాహుల్‌ గాంధీభవన్‌కు వచ్చారు. తొలిసారి వచ్చిన ఆయనకు పూలదండలు వేసి, వేద పండితుల ఆశీర్వచనం మధ్య ఘనంగా స్వాగతించారు. 
చదవండి👉🏼 కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ షాక్‌?

రాహుల్‌ తొలుత ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు, టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్, ఓయూ పరిశోధక విద్యార్థి చనగోని దయాకర్‌గౌడ్‌లతో మాట్లాడారు. తర్వాత తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ప్రతినిధులు బి.వేణుగోపాల్‌రెడ్డి, మధు తదితరులు తెలంగాణలో సమస్యలపై రాహుల్‌కు ఒక నివేదిక ఇచ్చారు. విస్తృతస్థాయి సమావేశం అనంతరం పార్టీ సభ్వత్య నమోదులో క్రియాశీలంగా పనిచేసిన వారితో రాహుల్‌ ఫోటోలు దిగారు. గాంధీభవన్‌లో 35 ఏళ్లుగా స్వీపర్‌ పనిచేస్తున్న యాదమ్మను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ రాహుల్‌కు పరిచయం చేశారు. రాహుల్‌ ఆమెతో సెల్ఫీ దిగారు. 

ప్యారడైజ్‌ బిర్యానీ.. నీలోఫర్‌ చాయ్‌ 
రాష్ట్ర పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ తనకు ఎంతో ఇష్టమైన హైదరాబాద్‌ బిర్యానీని ఆస్వాదించారు. మధ్యాహ్న భోజన సమయంలో ఆయన ప్రత్యేకంగా ప్యారడైజ్‌ హోటల్‌ నుంచి తెప్పించిన బిర్యానీని కోక్‌ తాగుతూ తిన్నట్టు గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. తర్వాత పేస్ట్రీ (కేక్‌) తిన్న రాహుల్‌.. కొంతసేపటి తర్వాత నీలోఫర్‌ కేఫ్‌ నుంచి తెచ్చిన చాయ్‌ను రుచి చూశారు. అంతకుముందు జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో రాహుల్‌ హైదరాబాద్‌ బిర్యానీ, చాయ్‌ బాగుంటాయని ప్రస్తావించారు. దీంతో నేతలు వెంటనే ఈ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. 
చదవండి👉🏻 రాహుల్‌ సభ సక్సెస్‌.. కాంగ్రెస్‌లో సమరోత్సాహం

మరిన్ని వార్తలు