బంగాళాఖాతంలో నేడు ఏర్పడనున్న అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్లు హెచ్చరించింది. మరోవైపు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు, తెలంగాణ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.