Raja Singh: చేటు తెచ్చిన మాటలు!.. 2018లో ఒకే ఒక్కడు.. 

24 Aug, 2022 16:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వైఖరి.. రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. తాజాగా ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఓ వర్గంపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం, తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ  ఆ వర్గం వారు తరచూ నగర పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది.

బక్రీద్‌ సందర్భంగానూ ఆయన ప్రత్యేకంగా యువకులతో గోరక్షక దళాలు ఏర్పాటు చేసి నగరానికి ఆనుకొని ఉన్న టోల్‌గేట్లు, నగరంలోకి ప్రవేశించే అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులపై గస్తీ ఏర్పాటు చేస్తారని.. ఓ వర్గం వారిపై దాడులకు పాల్పడతారన్న అపవాదు ఆయనపై ఉంది. ఈ విషయంలోనూ ఆయనపై దేశవ్యాప్తంగా పలు పోలీస్‌ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. నగరంలో సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీకి రాజాసింగ్‌ తీరుతో కొన్నిసార్లు మేలు జరగ్గా.. మరికొన్ని సందర్భాల్లో నష్టం వాటిల్లినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

2018లో ఒకే ఒక్కడు.. 
రాజాసింగ్‌ రెండుసార్లు గోషామహల్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో అంబర్‌పేట్‌ బరిలో నిలిచిన ప్రస్తుత కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ముషీరాబాద్‌ బరిలో నిలిచిన ప్రస్తుత పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌లు టీఆర్‌ఎస్‌ వేవ్‌ కారణంగా ఓడిపోయినా.. రాజాసింగ్‌ గెలిచి సత్తా చాటారు. 
చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే‌.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే!

మరిన్ని వార్తలు