BJP MLA Raja Singh: రాజాసింగ్‌ అరెస్ట్‌.. హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే భార్య

6 Sep, 2022 10:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆయన భార్య ఉషాభాయ్‌ హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 25న రాజాసింగ్‌ను పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజాసింగ్‌ను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు.

లా అండ్‌ ఆర్డర్‌కు భంగం కలిగిస్తున్నారని చెప్పి పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేయడానికి వీలుగా గత నెల 26న జీవో 1651ను జారీ చేశారని చెప్పారు. కేసుల గురించి చెప్పకుండానే పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేయడం అన్యాయమన్నారు. పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేసే ముందుకు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఎ నోటీసు ఇవ్వాలని, ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41ఎ నోటీసు ఇవ్వాలన్న నిబంధనను పోలీసులు ఉల్లంఘించారని చెప్పారు.

రాజాసింగ్‌కు ఆ విధమైన నోటీసు ఇవ్వకుండా అరెస్ట్‌ చేసినందున రిమాండ్‌కు పంపేందుకు కింది కోర్టు అంగీకరించలేదని వివరించారు. ‘కొందరి’ని సంతృప్తి పరిచేందుకే రాజాసింగ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారని చెప్పారు.
చదవండి: కేంద్రం సూచనలతో.. కంటోన్మెంట్‌లో టోల్‌ట్యాక్స్‌ రద్దు 

మరిన్ని వార్తలు