శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు స్కైట్రాక్స్‌ అవార్డు

10 Aug, 2021 01:21 IST|Sakshi

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 64 స్థానంలో నిలిచిన విమానాశ్రయం

శంషాబాద్‌: రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయం అవార్డును సొంతం చేసుకుంది. 2021 సంవత్సరానికి గాను ప్రపంచస్థాయిలో ఇచ్చే స్కైట్రాక్స్‌ అవార్డును దక్కించుకుంది. వరుసగా మూడుసార్లు ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. దీంతోపాటు ప్రపంచస్థాయిలో నిర్ధారించే టాప్‌ 100 విమానాశ్రయాల్లో 64 స్థానంలో నిలిచిందని జీఎంఆర్‌ వర్గాలు సోమవారం వెల్లడించాయి.

గతంలో 71వ ర్యాంకు ఉండేదని పేర్కొన్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా స్కైట్రాక్స్‌ విమాన ప్రయాణికుల అభిప్రాయాలు, వారి సంతృప్తిని కొలమానంగా చేసుకుని అవార్డులను అందజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 550 విమానాశ్రయాల్లోని ప్రయాణికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటిస్తుంది. కోవిడ్‌ పరిస్థితుల్లో కూడా జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆధునిక సాంకేతికతతో ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతోనే ఈ అవార్డు దక్కిందని గెయిల్‌ సీఈవో ప్రదీప్‌ ఫణీకర్‌ అన్నారు.

మరిన్ని వార్తలు