‘సింగరేణి’ సమస్యల పరిష్కారానికి రాజీనామాకు సిద్ధం

17 Sep, 2022 02:28 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజీనామాకు సిద్ధమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. సింగరేణిలో 8 రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన జీఎం కార్యాలయం ముట్టడిలో చందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఎమ్మెల్యే పదవి గొప్పదేమీ కాదు. మీరందరూ మద్దతిస్తే గెలిచిన వ్యక్తిని. ఈ రోజు చెప్తే ఈ రోజే రాజీనామా చేసేవాడిని.

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే ఎమ్మెల్యే పదవిని అయినా త్యాగం చేస్తా. కార్మికులు చేస్తున్న ఉద్యమానికి అండగా నిలబడతా’ అని ప్రకటించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు చట్టబద్ధమైనవని, ఈ ఉద్యమానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కార్మికులు విధుల్లోకి వెళ్లవద్దని చందర్‌ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపఎన్నికల ప్రభావం కొనసాగుతున్న సందర్భంలో ఎమ్మెల్యే రాజీనామా ప్రకటన నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. 

మరిన్ని వార్తలు