నాలుగేళ్లుగా వీడని బాలుడి అదృశ్యం మిస్టరీ?

26 Dec, 2022 10:48 IST|Sakshi
అఖిల్‌ (ఫైల్‌)  

సాక్షి, మెదక్‌: రామాయంపేట మండలంలోని అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ వద్ద నాలుగేళ్ల క్రితం కిడ్నాప్‌నకు గురైన బాలుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.  కుమారుడి కోసం తండ్రి తల్లడిల్లుతున్నాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌ మండలం క్యాసంపల్లి తండాకు చెందిన లంబాడి కపూర్య, అతడి రెండేళ్ల కుమారుడు అఖిల్‌ గతంలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు.  దీంతో ఏపని చేసుకోలేక విధిలేని పరిస్థితుల్లో కపూర్య భిక్షాటన ఎంచుకున్నాడు. కొడుకు, భర్తను వదిలి అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భిక్షాటనచేస్తూ తన కుమారుడితోపాటు రామాయంపేట వచ్చి కపూర్య కొద్దిరోజులపాటు ఇక్కడే గడిపాడు.  

అక్కన్నపేట రైల్వేస్టేషన్‌కు వెళ్లిన కపూర్య అక్కడ రైళ్లలో భిక్షాటనచేస్తూ రాత్రి స్టేషన్‌ ఆవరణలో నిద్రించాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడి కుమారుడు అఖిల్‌ను అపహరించుకపోయారు. తెల్లవారుజామున లేచి చూస్తే కుమారుడు కనిపించకపోవడంతో రామాయంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వాకబు చేసినా బాలుని ఆచూకీ లభించలేదు. రైలులో ప్రయాణిస్తున్నవారు బాలుడిని అపహరించుకపోయినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు.  కాగా  మహారాష్ట్ర, ఇతర దూరప్రాంతాల వారు రైలులో ప్రయాణిస్తున్నవారే బాలుడిని అపహరించుకపోయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు