సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాగోల్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం కారు బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉన్న నేపథ్యంలో నాగోల్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న TS08AA0117 నంబర్ గల కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో డ్రైవర్ కారు ఆపకుండా అతివేగంతో అక్కడి నుంచి దూసుకెళ్లాడు.
దీంతో అక్కడ తనఖీలు చేస్తున్న పోలీసులు సెట్ ద్వారా అలర్ట్ చేయడంతో ఎల్బీనగర్లో కారును ఆపేందుకు అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డ్ రమేష్ ప్రయత్నించాడు. అయితే అతి వేగంతో దూసుకొచ్చిన కారు డ్రైవర్ రమేష్ను ఢీకొట్టి క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటనలో హోంగార్డు రమేష్కు తీవ్రగాయాలు కావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలసుకున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆస్పత్రికి వెళ్లి హోంగార్డును పరామర్శించి, ఘటనపై ఆరా తీశారు.