జాతరలో తొక్కిసలాట: వ్యక్తి మృతి

1 Mar, 2021 12:02 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌: జాతరకు వెళ్లిన ఓ వ్యక్తి విగతజీవిగా మారాడు. రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన నిర్మల్‌లో చోటుచేసుకుంది. వివరాలు... అక్కాపూర్‌కు చెందిన మల్లేష్‌(45) ముజ్గి మల్లన్న జాతరకు వెళ్ళాడు. కాగా అక్కడి రథయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కిందపడిపోయిన మల్లేష్ తీవ్రగాయాలపాలయ్యాడు.

దీంతో వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ‌ప్రథమ చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకురాగా, చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అక్కాపూర్‌ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తీర్థయాత్ర ఇలా అంతిమయాత్రగా మారుతుందని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు విలపించిన తీరు అందరిచేతా కన్నీళ్లుపెట్టిస్తోంది. మరోవైపు.. ఇదే ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్స్‌ కోలుకుంటున్నారని, వారికి ప్రాణాపాయం లేదని పోలీసులు వెల్లడించారు.


 

మరిన్ని వార్తలు