-

రూ.4 కోట్లతో రియల్టర్‌ పరారీ పట్టిస్తే రూ.3 లక్షలిస్తాం

5 Jan, 2023 03:57 IST|Sakshi

బహుమతిస్తామని బాధితుల ఫ్లెక్సీలు

జగిత్యాల క్రైం: దొంగల్ని పట్టిస్తే నగదు బహు­మానం ఇస్తాం.. అంటూ పోలీసులు ప్రకటించడం చూసే ఉంటారు. కానీ జగిత్యాలలో ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రూ.4 కోట్ల వరకు అప్పులు చేసి పారిపోవడంతో.. అతన్ని పట్టిస్తే రూ.3 లక్షల నజరానా.. అంటూ బాధి­తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. జగిత్యాల జిల్లా గోవిందుపల్లికి చెందిన గాండ్ల వెంకన్న కుటుంబంతో సహా 15 రోజులుగా కనిపించడం లేదు.

వెంకన్న చాలాకాలంగా చిట్టీలు నడుపుతూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. నమ్మకంగా ఉండటంతో చాలామంది నమ్మి అతనికి  సుమారు రూ.4 కోట్ల వరకు అప్పు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. వెంకన్న పదిహేను రోజు­ల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పరార­య్యాడు. దీంతో బాధితులు జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ‘గాండ్ల వెంకన్న కనిపించడం లేదు.. ఆయనను పట్టించిన వారికి రూ.3 లక్షల నజరానా ఇస్తాం’ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాధితులెవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు