రెణ్నెళ్లకే నాలుగు లక్షలు పెరిగిందా.. గిదేం లెక్కనే!?

15 Mar, 2021 14:44 IST|Sakshi

నిలిచిన వెంచర్లు.. పెరిగిన ధరలు

పాత ప్లాట్లకు డిమాండ్‌

రీసేల్‌ .. జోరు

రెడీమేడ్‌ ఇళ్లకూ గిరాకీ

రిజిస్ట్రేషన్లు లేక ఆగిన కొత్త ప్లాట్ల అమ్మకం

నిర్మల్‌: ‘అరె.. ఏమన్నా.. అంత చెబుతున్నవ్‌. రెండు నెలల కిందట రూ.8 లక్షలకే తీసుకో అన్నవ్‌. ఇప్పుడేమో పన్నెండు చెబుతున్నవ్‌. గీ రెణ్నెళ్లకే నాలుగు లక్షలు పెరిగిందా..! గిదేం లెక్కనే..’ అని కస్టమర్‌ అడుగుతుంటే.. ‘అట్లనే ఉన్నది భాయ్‌ సాబ్‌. ఇప్పుడు కొత్త వెంచర్ల ప్లాట్లకు సర్కారు రిజిస్ట్రేషన్‌ చేస్తలేదు. ఇంతకు ముందు రిజిస్ట్రేషన్‌ చేసి ఉన్న ప్లాట్లకే చేస్తున్నరు.వాటికే డిమాండ్‌ పెరుగుతున్నది. అందుకే పాత ప్లాట్ల ధరలు పెంచినం..’ అని రియల్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వం వెంచర్ల ఏర్పాట్లలో నిబంధనలు పెట్టడం, కొత్త వెంచర్ల విషయంలో క్లా రిటీ ఇవ్వకపోవడంతో చాలామంది గతంలో రిజిస్ట్రేషన్‌ చేసిన ప్లాట్లపైనే దృష్టి పెడుతున్నారు. ఈ క్ర మంలో రీసేల్‌లో వీటి ధరలు రెట్టింపవుతున్నాయి.

జిల్లాలో జోరుగా..
మిగతా జిల్లాలతో పోలిస్తే నిర్మల్‌ జిల్లాలో రియల్‌ఎస్టేట్‌ రంగం జోరుగా పెరుగుతోంది. ఇటీవల సర్కారు కొత్త లేఅవుట్‌ నిబంధనలను పక్కాగా అమలు చేయకముందు ఎటు చూసినా వెంచర్లే దర్శనమిచ్చాయి. ప్రస్తుతం కొత్త ప్లాట్ల ఏర్పాటు తగ్గి నా.. భూములకు డిమాండ్‌ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ భూమి మీద పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో సామాన్యుడికి అందనంతగా ధరలు చేరువవుతున్నాయి. జిల్లాకేంద్రం చుట్టూ ఐదారు కిలోమీటర్ల వరకు ఎకరం రూ.కోటిన్నర నుంచి రూ.రెండు కోట్లు పలుకుతోందంటే.. పరిసి ్థతి అర్థం చేసుకోవచ్చు. అసలు.. కొనడానికి పెద్దమొత్తంలో భూమి దొరకడమే గగనంగా మారింది. ఎక్కడో మారుమూల ఉన్న భూమి కూడా ఎకరానికి రూ.కోటిపైనే విక్రయిస్తున్నారు.

పాత వాటికే..
లేఅవుట్‌ నిబంధనలు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కొరడా ఝుళిపించడంతో కొత్త వెంచర్లకు దెబ్బ ప డింది. మారిన నిబంధనల ప్రకారం ఎకరానికి ఐదా రు ప్లాట్లు తగ్గుతున్నాయి. మరోవైపు కొత్తగా వెంచ ర్లు చేసిన ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయడం ఇంకా మొదలు పెట్టలేదు. వాటిపై ఇప్పటి దాకా ఎలాంటి క్లారి టీ కూడా ఇవ్వలేదు. దీంతో చాలామంది పాత(రీసే ల్‌) ప్లాట్లపైనే దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం సా మాన్య, మధ్యతరగతి కుటుంబాలు సైతం తమకంటూ కొంత భూమి ఉండాలని ఆశపడుతున్నాయి. అప్పు చేసైనా సరే ఓ ప్లాటు కొనాలనుకుంటున్నా యి. ఈ క్రమంలో తమకు అందుబాటులో వచ్చే ప్లా ట్లు కాస్త దూరమైనా ఫర్వాలేదంటున్నారు. అందుకే పట్టణాలకు కనీసం ఐదారు కిలోమీటర్ల వరకూ వెంచర్లు అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రీసేల్‌ ప్లా ట్లకే రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉండటంతో వాటి ధర పెరిగినా అప్పుచేసి మరీ వాటినే తీసుకుంటున్నారు. 

ఇళ్లపై దృష్టి..
ప్లాట్లు కొని ఇబ్బందులు పడే కంటే నేరుగా ఇల్లునే తీసుకుంటే బాగుంటుంది కదా.. అన్న ధోరణి కూ డా పెరుగుతోంది. ప్రధానంగా భర్త, భార్య, పిల్లలు ఉన్న చిన్న కుటుంబాలు ఇలాంటి ప్రణాళికల్లోనే ఉంటున్నాయి. ప్లాట్లు, రిజిస్ట్రేషన్, కన్‌స్ట్రక్షన్‌.. ఇలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా రెడీమేడ్‌ ఇళ్లు ఉంటే తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈక్రమంలో జిల్లాలో రియల్టర్లతో పాటు బిల్డర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. వారే చిన్నపాటి సైజ్‌లో ఓ డబుల్‌బెడ్రూం ఇల్లును కట్టించి ఇస్తున్నారు. కుటుంబ రాబడి, వారు పెట్టే పెట్టుబడిని బట్టి ఇళ్ల ను చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాకేంద్రంలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం వేగమవుతోంది. పదులసంఖ్యలో కొత్త అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నారు. పేస్లిప్, ఇన్‌కంటాక్స్‌ పేమెంట్‌ రెగ్యులర్‌ ఉన్నవాళ్లకు బ్యాంకులు సైతం ఇళ్లరుణాలు ఇస్తుండటంతో వాటి వైపు దృష్టి పెడుతున్నారు.

నిలిచిన రిజిస్ట్రేషన్లు..
ప్రభుత్వం పక్కాగా ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేస్తుండటం, లేఅవుట్‌ ప్రకారం వెంచర్లుండాలని చెప్పడంతో రియల్టర్లు కొత్తవాటిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గతంలో రిజిస్ట్రేషన్‌ చేసిన ప్లాట్ల విక్రయాలే జోరందుకుంటున్నాయి. ఈక్రమంలో వాటి ధరలూ పెరుగుతున్నాయి. జిల్లాకేంద్రంలో మూడు నెలల కిందటి వరకు ఏరియాను బట్టి 40/50ప్లాటు ధర రూ.8లక్షల–14లక్షలవరకుఉండగా.. ఇప్పుడు రూ. 15లక్షల పైనే చెబుతున్నారు. కొన్ని కాలనీల్లో రూ. 40నుంచి 50లక్షల్లో ధరలు నడుస్తున్నాయి. లేఅవు ట్‌ ప్రకారం చేసి, పాతధరలకు అమ్మితే, తమకు ఏం లాభం ఉండదని రియల్టర్లు చెబుతున్నారు. కొత్త లేఅవుట్‌ ప్రకారం వెళ్తే.. కచ్చితంగా ప్లాట్ల ధరలను పెంచాల్సి వస్తుందంటున్నారు. మరోవైపు ఓ ప్లాటైనా కొనుక్కుందామనుకునే మధ్యతరగతి కు టుంబాలు ఈ ధరలు చూసి బెంబేలెత్తుతున్నాయి.

చదవండి: ఒకప్పుడు భయపడేవారు.. ఇప్పుడు ప్రశంసలు‌!

మరిన్ని వార్తలు