గూగుల్‌లో ఈ పదాల కోసం తెగ వెతుకుతున్న తెలుగు ప్రజలు

8 May, 2021 12:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇదివరకు గూగుల్‌లో సెర్చింగ్‌ అంటే.. హీరోలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు లేదా క్రికెట్‌ ఆటగాళ్ల గురించి తెలుసుకోవడానికి చూసే వాళ్లం. కానీ దేశంలో కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ప్రజల అలవాట్లే కాదు గూగుల్‌లో సెర్చ్‌ చేసే పదాలను కూడా కరోనా మార్చేసిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌  గురించి గూగుల్‌లో తెగ గాలిస్తున్నారు.

రెమిడెసివిర్‌నే ఎందుకు వెతుకుతున్నారు
కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో రెమిడెసివిర్‌ వైరస్‌ పై ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు తెలిపారు. ఇక అప్పటి నుంచి మార్కెట్లో ఈ ఇంజక్షన్‌ కు విపరీతమైన డిమాండ్‌ వచ్చేసింది. ప్రస్తుతం ఈ ఇంజక్షన్‌ బహిరంగ మార్కెట్లో దొరక్క బ్లాక్‌ మార్కెట్లో వేలు పోసి కొంటున్నారు. బయట అందుబాటులో లేకపోవడం, ఎక్కడా చూసినా ఈ ఇంజక్షన్‌ పేరే వినపడడంతో దీని గురించి తెలుసుకోవడానికి గూగుల్లో‌ ఇలా గాలిస్తున్నారు. రాష్ట్రాల పరంగా చూస్తే.. కర్ణాటక, ఢిల్లీ టాప్‌ రెండు స్థానాల్లో ఉండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌​ రాష్ట్రాలు మూడు,నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

నగరాల పరంగా .. కర్ణాటకలోని విజయపురా, బీదర్‌, హసన్‌, కాలాబురగి, బెంగళూరు.. తెలంగాణలో ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ ఉన్నాయి. ఇక ఆంధ్రా లో గుంటూరు, విజయవాడ, ఓంగోలు, విజయనగరం ఉన్నాయి. రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ల కొరత వలనే ప్రజలు ఇంతలా వాటి కోసం గూగుల్‌ లో చూస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక విపరీతంగా గూగుల్‌లో చూస్తున్న రెండో పదంగా ఆక్సిజన్‌ ఉంది. 

కరోనా వీర విహారం చేస్తున్న నేపథ్యంలో దేశంలో ఆక్సిజన్‌ సిలిండర్లు కొరతతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సహజంగా ఆక్సిజన్‌ లెవల్స్‌ ఎలా పెంచుకోవాలో అనే విషయంపై తెగ వెతుకుతున్నారు. ఇందులో ఢిల్లీ టాప్‌లో ఉండగా హర్యానా, యూపీ, గోవా,కర్ణాటక వరుసగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏడో  స్థానంలో ఉంది.

( చదవండి : కరోనా డాక్టర్ల కాసుల దందా.. బ్లాక్‌ మార్కెట్‌లో రెమిడెసివర్‌ )

>
మరిన్ని వార్తలు