ప్రాంతీయ భాషల వారిని నియమించండి

19 Sep, 2022 01:22 IST|Sakshi

ఇండిగో యాజమాన్యానికి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి

విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికురాలి విజ్ఞప్తికి కేటీఆర్‌ స్పందన

సాక్షి, హైదరాబాద్‌: దేశీయ విమాన సర్వీసుల నిర్వహణలో ఇండిగో విమానంలో ప్రాంతీయ భాషలైనా తెలుగు, తమిళ, కన్నడ వచ్చిన ఎయిర్‌హోస్టెస్‌లను నియమించుకోవాలని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సంబంధిత విమాన సంస్థకు ట్విట్టర్‌ ద్వారా సూచించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో వస్తున్న సమయంలో ఓ ప్రయాణికురాలు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ డోర్‌ ఉన్న సీట్లో కూర్చు­న్నారు.

ఆ సీట్లలో కూర్చున్న వారికి ప్రత్యేకంగా కొన్ని సూచనలు, సలహాలు ఇస్తారు. ఆ సమయంలో సంబంధిత ప్రయాణికురాలికి ఎయిర్‌హోస్టెస్‌ సూచించిన అంశాలు ఇంగ్లిష్‌లో ఉండటంతో సీటు మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై దేవాస్మిత చక్రవర్తి అనే ప్రయాణికురాలు ట్వీట్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తున్న విమానాల్లో తెలుగు భాష వచ్చిన ఎయిర్‌హోస్టెస్‌ నియమించేలా చూడాలని, దీనివల్ల భద్రతా సంబంధిత సూచనలు తేలికగా తెలుగు మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుందని, ఇంగ్లిష్, హిందీ మాత్రమే వచ్చిన వారినే నియమించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయనిఆ ట్వీట్‌లో తెలిపింది. ఈ ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్‌ స్థానిక భాషల్లోనూ సూచనలు అందించేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా స్థానిక భాషలు వచ్చిన సిబ్బందిని నియమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు