3 కోట్ల భూమికి రూ. 10 లక్షలే.. ఇదేం న్యాయం

20 Mar, 2022 10:06 IST|Sakshi
మెదక్‌ జిల్లా కాళ్లకల్‌లో పాదయాత్ర చేస్తున్న రేవంత్‌రెడ్డి తదితరులు

ఆర్‌ఆర్‌ఆర్‌ పేరుతో పేదల భూములు లాక్కుంటున్నారు      

సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ ఫైర్‌

సాక్షి,తూప్రాన్‌ (మెదక్‌): ‘రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) పేరుతో పేదల భూములను సీఎం కేసీఆర్‌ లాక్కుంటున్నారు. ఎకరాకు రూ.3 కోట్లు పలుకుతున్న భూములకు రూ.10 లక్షల చొప్పున భిక్షం వేస్తున్నారు. పేదల భూములను పెత్తందారులకు అంటగట్టే కుట్రలు పన్నుతున్నారు’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని చెప్పుతో కొట్టండని ప్రజలకు పిలుపునిచ్చారు. (చదవండి: ఇదీ రూట్‌.. ఒరిస్సా టు మహారాష్ట్ర  వయా హైదరాబాద్‌.. కానీ మధ్యలో.. )

శనివారం మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం లోని కాళ్లకల్‌కు చేరుకున్న సర్వోదయ సంకల్ప యాత్రలో రేవంత్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన ఫౌం హౌజ్‌లోని భూమిని పేదలకు రూ.10 లక్షలకు ఎకరం చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  రైతులు వరి పంట సాగు చేయొద్దని చెప్పిన కేసీఆర్‌.. తాను ఫౌంహౌజ్‌లో 150 ఎకరాలు సాగు చేశారన్నారు. ‘రైతులకో నీతి.. తనకో నీతా’ అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ రైతులకు అన్యాయం చేస్తోందని, కార్పొరేట్‌ శక్తులకు వత్తాసు పలుకుతోందని దుయ్యబట్టారు.
 

మరిన్ని వార్తలు