నా వాహనాన్ని ఎవరు ఆపమన్నారు?: రేవంత్‌ రెడ్డి ఫైర్‌

17 May, 2021 01:02 IST|Sakshi

పోలీసులపై విరుచుకుపడ్డ రేవంత్‌రెడ్డి 

సాక్షి, సనత్‌నగర్‌: ’ఈ ప్రభుత్వం, మీరు హోష్‌ ఉండే పనిచేస్తున్నారా? నా వెహికల్‌ ఆపమని చెప్పిందెవరు? మీ కమిషనర్‌కు ఏమైనా తలకాయ తిరుగుతుందా? తమాషా చేస్తున్నారా? మీ ప్రాబ్లం ఏంటీ, కాగితం ఏదైనా ఉందా.. స్థానిక ఎంపీనైన నా బండిని ఎలా ఆపుతారు. నాకు ఈ రోజు ఐదు కార్యక్రమాలున్నాయి. గాంధీ, కంటోన్మెంట్‌ ఆర్మీ ఆస్పత్రి, సికింద్రాబాద్‌ తదితర చోట్ల కష్టాల్లో ఉన్న వారికి అన్నం పెట్టేందుకు వెళుతున్నా. వారి నోటి దగ్గర అన్నం లాగేస్తారా? మీరెందుకు రోడ్ల మీద ఉన్నారు. నేను డ్యూటీ చేస్తున్నా’ అంటూ బేగంపేట పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంతంలో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పోలీసులపై విరుచుకుపడ్డారు.

ఆదివారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రి వద్ద జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి వెళుతున్న ఆయన కారును బేగంపేట ఏసీపీ నరేశ్‌ రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు అడ్డుకున్నారు. కారులో నుంచి దిగిన ఆయన పోలీసుల తీరును ఎండగట్టారు. తిరుమలగిరి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్లు ఇచ్చేదుందంటూ పోలీసులకు చెప్పారు. అటు తర్వాత తనను అడ్డుకున్న విషయాన్ని రేవంత్‌రెడ్డి కమిషనర్‌ అంజనీకుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్‌ కూడా గాంధీ ఆస్పత్రికి వెళ్లేందుకు వీల్లేదంటూ సమాధానం ఇచ్చారు. గాంధీకి వెళ్లేది లేదంటే అక్కడ నిబంధనలు పెట్టుకోవాలని ఇక్కడ ఆపేయడం ఏంటని రేవంత్‌ ప్రశ్నించారు. అనంతరం తిరుమలగిరి కోవిడ్‌ ఆస్పత్రికి వెళ్లేందుకు ఆయనకు అనుమతినివ్వడంతో వెళ్లిపోయారు. దీంతో కొద్దిసేపు రోడ్డుపై టెన్షన్‌ నెలకొంది.   

మరిన్ని వార్తలు