కార్మికులను ఆర్టిజన్స్‌గా నియమించుకోవాలి 

23 Sep, 2022 03:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రాన్స్‌కో సీఎండీ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే కేటీపీఎస్‌ 6వ దశ నిర్మాణ కార్మికులను ఆర్టిజన్స్‌గా నియమించుకోవాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కేటీపీఎస్‌ 7వ దశ నిర్మాణ సమయంలో 6వ దశలో పాలుపంచుకున్న కార్మికులను ఆర్టిజన్స్‌గా తీసుకుంటామని సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు రాత పూర్వకంగా హామీ ఇచ్చారని, 7వ దశ నిర్మాణం సందర్భంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారని గుర్తు చేశారు.

ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి గురువారం లేఖ రాశారు. కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం క్షమించరాని విషయమని తెలిపారు. ఇదంతా జరిగి ఐదేళ్లు అవుతున్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. కేటీపీఎస్‌ 6వ దశ నిర్మాణ సమయంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నా.. వాటిని లెక్క చేయకుండా పని చేసిన కార్మికుల కష్టాన్ని విస్మరించడం దారుణం కాదా? అని నిలదీశారు. కార్మికులను ఆర్టిజన్స్‌గా నియమించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు