‘గ్రేటర్‌’ తెచ్చిన కరోనా

4 Dec, 2020 10:00 IST|Sakshi

మళ్లీ పెరుగుతున్న కేసులు

అప్రమత్తంగా ఉండాలంటున్న  వైద్యాధికారులు 

ఆదిలాబాద్‌టౌన్‌: కోవిడ్‌ విజృంభణ మళ్లీ మొదలైంది. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయింది. రెండు రోజుల క్రితం పదిలోపే కరోనా కేసులు నమోదవుతుండగా, గురువారం ఏకంగా 65 కేసులు నమోదయ్యాయి. దీంతో జనాల్లో భయాందోళన మొదలైంది. చాలా మంది ప్రజలు కోవిడ్‌ నిబంధనలను పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నారు. భౌతిక దూరాన్ని మరిచారు. దీంతో వైరస్‌ వ్యాప్తి చెందుతుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూనే  అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మార్కెట్, రైతుబజార్, దుకాణ సముదాయాల ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించకపోవడం, మాసు్కలు ధరించకపోవడంతో కేసుల సంఖ్య పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే చాలా మందికి కరోనా వైరస్‌ లక్షణాలు లేకుండానే వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఇటీవల హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధులకు వెళ్లిన పోలీసులకు కోవిడ్‌ సోకినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. బుధవారం 14 మంది పోలీసులకు కోవిడ్‌ నిర్ధారణ కాగా, గురువారం నిర్వహించిన పరీక్షల్లో కూడా పలువురు పోలీసులకు కరోనా సోకినట్లు సమాచారం. 

అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులే..
సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. పెండ్లీలు, విందులు, ఇతర కార్యక్రమాలకు హాజరైన వారు లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యాశాఖాధికారులు పేర్కొంటున్నారు. సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో శుభకార్యాలు, ఇతర వాటికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు మరింతగా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మాసు్కలు లేనిదే బయటకు రావద్దని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ తెలిపారు. 

జిల్లా వ్యాప్తంగా గురువారం 1949 మందికి కరోనా పరీక్షలు చేయగా 65 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 1874 రిపోర్టు నెగిటివ్‌ రాగా, 10 నమూనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా ఇద్దరు కోలుకున్నారు. ఇప్పటివరకు 40 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌లో 1, అటెండర్‌కాలనీలో 1, బెల్లూరిలో 1, భుక్తాపూర్‌లో 1, చాందా(టి)లో 5, కలెక్టర్‌చౌక్‌లో 1, దుర్గానర్‌లో 2, ఎంప్లాయీస్‌ కాలనీలో 1, గ్రీన్‌ సిటీలో 1, కైలాస్‌నగర్‌లో 2, కోలిపురలో 1, కృష్ణనగర్‌లో 1, కుమ్మర్‌వాడలో 1, మహాలక్ష్మీవాడలో 1, మావలలో 1, న్యూహౌసింగ్‌బోర్డులో 2, పోలీస్‌ క్వార్టర్‌లో 1, రాంనగర్‌లో 1, రాంపూర్‌లో 1, రవీంద్రనగర్‌లో 2, రిక్షా కాలనీలో 2, సంజయ్‌నగర్‌లో 5, శాంతినగర్‌లో 4, టైలర్స్‌ కాలనీలో 2, టీచర్స్‌కాలనీలో 1, తిర్పెల్లిలో 1, ఇచ్చోడలోని అడెగాం(బి)లో 1, ఇచ్చోడ పీఎస్‌లో 2, ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో 1, జైనథ్‌లోని ఆనంద్‌పూర్‌లో 1, ఉట్నూర్‌లోని బోయవాడలో 1, కొత్తగూడలో 1, సేవదాస్‌నగర్‌లో 1, ఉట్నూర్‌లో 1, ఉట్నూర్‌ పీఎస్‌లో 6, నేరడిగొండలో 1, బుగ్గారం(బి)లో 1, ఇంద్రవెల్లి పీఎస్‌లో 2, తలమడుగులోని ఝరిలో 1, సిరికొండలోని తిమ్మపూర్‌లో 1, సుంగాపూర్‌లో 1 చొప్పున కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌ఓ వివరించారు.

        

మరిన్ని వార్తలు