కొంప ముంచిన ఆర్‌ఎంపీ వైద్యం.. బాలిక పరిస్థితి విషమం..

28 Jun, 2021 12:32 IST|Sakshi

సాక్షి, మరిపెడ(మహబూబాబాద్‌): ఓ ఫస్ట్‌ ఎయిడ్‌ క్లినిక్‌ నిర్వాహకుడు తన స్థాయికి మించి ఓ బాలికకు వైద్యం చేయడంతో పరిస్థితి విషమంగా మారిన ఘటన మరిపెడ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మరిపెడ మండలం వీరారం గ్రామానికి చెందిన దళిత మైనర్‌ బాలిక ఇటీవల జ్వరంతో బాధపడుతుండగా ఈనెల 15న మండల కేంద్రంలోని ఓ ప్రైయివేట్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ క్లినిక్‌కు తీసుకొచ్చారు. పరీక్షించిన ఆర్‌ఎంపీ ఇవ్వాల్సిన డోస్‌ కంటే హైపర్‌ యాంటిబయోటిక్‌ ఇంజక్షన్‌ ఇచ్చి ఇంటికి పంపించాడు.

మూడు రోజుల తర్వాత బాలికకు శరీరంపై బొబ్బలు వచ్చి అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యలు పరీక్షించి ఓవర్‌ డోస్‌ ఇంజక్షన్‌ ఇవ్వడం వల్లే పరిస్థితి వికటించినట్లు వెల్లడించారు. అక్కడ చేసిన వైద్యానికి సుమారు రూ.లక్ష కావడంతో ఇకపై స్థోమతలేని తల్లిదండ్రులు బాలికను ఇంటికి తీసుకొచ్చారు. ఆదివారం బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆర్‌ఎంపీని నిలదీయగా.. విషయం బయటకు పొక్కడంతో చేసేది లేక అతను మధ్యవర్తుల ద్వారా రూ.2 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. బాలికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. 
చదవండి: Covid-19: పెరుగుతున్న గుండె కుడివైపు వైఫల్య సమస్యలు

మరిన్ని వార్తలు