నేడు దిశ కమిషన్‌ ముందుకు సజ్జనార్‌ 

4 Oct, 2021 04:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారణ, రెండురోజుల విరామం తర్వాత సోమవారం పునఃప్రారంభం కానుంది. దిశ హత్యాచారం జరిగిన సమయంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను తొలిసారిగా త్రిసభ్య కమిటీ విచారించనుంది. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌కు కమిషన్‌ ఇప్పటికే సమన్లు జారీ చేసింది.

ఆయన్ను సుదీర్ఘంగా మూడురోజుల పాటు విచారించే అవకాశమున్నట్లు తెలిసింది. సుమారు 30 ప్రశ్నలను సంధించనున్నట్లు సమాచారం. దిశ హత్యాచార నిందితులను సీన్‌–రీకన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్లే సమయంలో హాజరైన రెండో సాక్షి. ఫరూక్‌నగర్‌ అదనపు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అబ్దుల్‌ రహుఫ్‌ విచారణ సోమవారం ఉదయం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో సజ్జనార్‌ హాజరయ్యే అవకాశముందని ఇండిపెండెంట్‌ కౌన్సిల్‌ అడ్వకేట్‌ పీవీ కృష్ణమాచారి ‘సాక్షి’కి తెలిపారు. 

మరిన్ని వార్తలు