అక్కడికి బస్సు కోసం నెటిజన్‌ ట్వీట్‌.. స్పందించిన సజ్జనార్‌

20 Mar, 2022 17:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ శివారులోని ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహం వద్దకు వీకెండ్‌లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. సమతామూర్తి విగ్రహం వద్దకు నేరుగా ఆర్టీసీ బస్సుల్లేవని,  అక్కడికి వెళ్లేందుకు  క్యాబ్ వాళ్లు రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని ట్విట్టర్‌లో ఎండీ సజ్జనార్‌ దృష్టికి ఓ నెటిజన్ తీసుకెళ్లారు. వీకెండ్‌లో అక్కడికి ఆర్టీసీ బస్‌లను ఏర్పాటు చేస్తే.. సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కోరారు. 

ఈ ట్వీట్‌కు సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. ‘ఆర్టీసీ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు. ఈ మార్గంలో ఆర్టీసీ బస్‌ను ఏర్పాటు చేయండి. అందుకు అనుగుణంగా సమయాలను అప్‌డేట్ చేయండి’అని ఆర్టీసీ అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఖాతాలను ట్యాగ్ చేశారు. సమతామూర్తి విగ్రహం వద్దకు బస్ సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆ ట్వీట్‌కు ఉన్నతాధికారులు సమాధానం ఇచ్చారు.

మరిన్ని వార్తలు