అయ్యో పాపం; పచ్చని కుటుంబంలో ‘కరోనా’ కల్లోలం

3 Jun, 2021 09:50 IST|Sakshi
కరోనా తో మృతి చెందిన తల్లిదండ్రులు, కుమారుడు  

పది రోజుల వ్యవధిలో భర్త, అత్త మామలను కోల్పోయిన వైనం

బైనగారి కుటుంబాల్లో తీరని వేదన! 

సాక్షి, సంగారెడ్డి: ఓ పచ్చని కుటుంబంలో కరోనా సృష్టించిన కల్లోలం తీరని వేదనను మిగిల్చింది. కరుణ లేని కరోనా బంధాలను, అనుబంధాలను ఛిదిమేసి వీరి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. పది రోజుల వ్యవధిలోనే భర్త, అత్తమామలను కోల్పోయిన బైనగారి శోభ తీవ్ర విషాధంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే..  

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన బైనగారి నర్సింలు(72), బైనగారి విజయ(65) దంపతులు. ఒక్కరిని విడిచి ఒక్కరూ ఉండకుండా కలిసి మెలసి ఎంతో అన్యోన్యంగా ప్రేమతో ఉండేవారు. కరోనా పాజిటివ్‌ ఇద్దరికి ఒకేసారి నిర్ధారణ కావడంతో గ్రామంలోనే తన ఇంట్లో హోమ్‌ ఐసొలేషన్లో ఉంటూ చికిత్స పొందారు. వీరికి అవసరమైన మందులను, పౌష్టికాహారాన్ని వారి కుమారులు అందించారు. ధైర్యం కూడా చెప్పారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స తీసుకుంటూ ఏప్రిల్‌ 25న బైనగారి నర్సింలు, 28న బైనగారి విజయ మృతి చెందారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందారు. 

వీరి బాగోగులు చూసిన వీరి చిన్న కుమారుడు శోభ భర్త సతీష్‌ (45) సైతం మే 4న మృతి చెందాడు. మహమ్మారి కాటుకు అయినవాళ్లను పోగొట్టుకొని శోభ పడుతున్న వేదన వర్ణనాతీతం. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వీఆర్‌ఏగా పని చేస్తూ సదాశివపేట పట్టణంలో నివాసం ఉంటూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. తోడునీడై ఉండాల్సిన వాళ్లు కరోనాకు బలైపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

చదవండి:
20 లక్షలు ఖర్చు: వారం వ్యవధిలో భార్యాభర్తలు మృతి 
పేర్లు మార్చుకొని. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. చివరికి!

మరిన్ని వార్తలు