శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పైత్యం.. లైవ్‌లో చితకబాదిన బంధువులు

1 Aug, 2021 12:14 IST|Sakshi
శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను చితక బాదుతున్న బాధిత మహిళ

సాక్షి, సదాశివపేట(సంగారెడ్డి): లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వెంకన్నను మహిళలు చితకబాదిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దాపూర్‌ కాలనీకి చెందిన ఓ మహిళ కొత్త ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు విషయం తెలుసుకున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు. తాను లోన్‌ ఇప్పిస్తానని ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలిపింది.

గురువారం సాయంత్రం బాధిత మహిళ కుటుంబ సభ్యులు వెంకన్న ఇంటికి వెళ్లి అతడిని చితకబాదారు. గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో శనివారం పోస్టు చేయడంతో విషయం బట్టబయలైంది. శానిటరీ ఇన్‌స్పెక్టర్, బాధిత మహిళ పరస్పరం ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డిని వివరణ కోరగా విధుల్లో ఉన్న శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను చితకబాదుతున్న విషయం తెలుసుకొని అక్కడకు వెళ్లి వారిని సముదాయించామన్నారు. ఇరువురు పోలీస్‌ స్టేషన్‌లో రాజీ చేసుకొన్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు