పంచాయతీ కార్యదర్శిపై చెప్పులతో దాడి!

18 Aug, 2021 08:22 IST|Sakshi
ఎంపీడీవోకు ఫిర్యాదు చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు

సాక్షి, కెరమెరి(ఆదిలాబాద్‌): మండలంలోని కైరి పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్‌పై సర్పంచ్‌ లెండుగురే విజయలక్ష్మి, ఆమె భర్త బాలాజీ చెప్పులతో దాడి చేసినట్లు మంగళవారం పంచాయతీ కార్యదర్శులు సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో దత్తారాం, పీఎస్సై ప్రశాంత్‌కు ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యాలయంలో విధుల్లో ఉండగా అకారణంగా దూషిస్తూ సర్పంచ్‌తోపాటు ఆమె భర్త చెప్పులతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంఘం నాయకులు మహేందర్‌రెడ్డి, రమేశ్, మల్లేశ్, హరీశ్, ధర్మయ్య తెలిపారు.

బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈమేరకు సర్పంచ్‌ విజయలక్ష్మి, బాలాజీని వివరణ కోరగా.. ఇటీవల పంచాయతీలో చేపట్టిన పనులకు సంబంధించి తీర్మానం కావాలని కోరామన్నారు. అయితే మహిళా సర్పంచ్‌ అని చూడకుండా దుర్భాషలాడారని ఆరోపించారు. తాము చెప్పులతో దాడి చేయలేదని, పంచాయతీ కార్యదర్శి అకారణంగా నిందలు వేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌తోపాటు డీపీవోకు నివేదిస్తానని ఎంపీడీవో తెలిపారు. కాగా.. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సర్పంచ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.   

మరిన్ని వార్తలు