బిత్తిరి సత్తితో ‘గరం గరం వార్తలు’.. రేపే ప్రారంభం

1 Aug, 2020 10:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిత్తిరి సత్తి ‘గరం గరం వార్తలు’ ప్రోగ్రాం ఆదివారం ప్రారంభం కానుంది. సాక్షి టీవీలో ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు తిరిగి ఉదయం మళ్లీ అదే సమయానికి ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు తనికెళ్ల భరణితో సత్తి జరిపిన సంభాషణకు సంబంధించిన తాజా వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఇందులో.. ‘‘పూలు పూల అంగీ.. పూలు పూల లాగు’’ తో సత్తి తనదైన ఆహార్యంతో ఆకట్టుకుంటున్నాడు. అంతేగాక అతిథికి ‘గరం గరం’ ఛాయ్‌ ఇచ్చి మర్యాదలు చేస్తూనే.. మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలపై తన మార్కు డైలాగ్‌ విసిరి ప్రోగ్రాం ఎలా ఉండబోతుందో హింట్‌ ఇచ్చాడు. ‘‘సత్తీ.. పూల పూల అంగీ.. జబర్దస్త్‌ కొడుతున్నవ్‌.. హా’’ అంటూ తనికెళ్ల భరణి పలకరించగా.. ‘‘గరం గరం శాయె దెచ్చిన సార్‌ తీసుకోండి’’ అంటూ సత్తి ఆయనకు టీ అందించాడు.

ఇక తనతో పాటు ఛాయ్‌ను పంచుకోమని తనికెళ్ల భరణి కోరగా..‘‘అమ్మో వద్దు సార్‌. దినాలు మంచిగ లెవ్వు. ఎవని శాయె ఆడే తాగాలే. తీసుకోండి’’ అంటూ జాగ్రత్తలు సూచించాడు. ఇక సాక్షి టీవీలోకి సత్తి ఆగమనాన్ని చాటుతూ ప్రత్యేకంగా రూపొందించిన వీడియో నెటిజన్లను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవికుమార్‌ సాక్షి టీవీ ద్వారా ‘గరం గరం వార్తలు’  ప్రోగ్రాంతో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే.(‘గరం గరం వార్తల’తో సరికొత్త స్టైల్లో సత్తి!)

మరిన్ని వార్తలు